telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఈ నెల 14 నుంచి ఇసుక వారోత్సవాలు!

ఏపీ ప్రభుత్వం ఈ నెల 14 నుంచి 21వరకు ఇసుక వారోత్సవాలు నిర్వహించనుంది. ఈ రోజు 13 జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇసుక వారోత్సవాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వరదల కారణంగా రాష్ట్రంలో ఇసుక రీచ్ లు మునిగిపోవడంతో కొరత ఏర్పడిందని జగన్ పేర్కొన్నారు. గత వారం రోజుల్లో పరిస్థితి మెరుగుపడిందన్నారు. వినియోగంలోకి వచ్చిన రీచ్ ల సంఖ్య 90కి పెరిగిందన్నారు.

అదేవిధంగా ఇసుక సరఫరా 1.2 లక్షల టన్నులకు పెరిగిందని అన్నారు. గతంలో ఇసుక సగటు డిమాండ్ 80వేల టన్నులుగా ఉందని చెప్పారు. వచ్చే ఏడురోజుల్లో రోజువారీ సరఫరాను 2 లక్షల టన్నులకు, ఇసుక స్టాక్ పాయింట్లను 137నుంచి 180కి పెంచాలని జగన్ అధికారులను ఆదేశించారు. నియోజకవర్గాల వారీగా రేటు కార్డును రెండురోజుల్లోగా నిర్ణయించాలని సూచించారు. రాష్ట్రంలో ఇసుక కొరత తీరేవరకు అధికారులు సెలవు తీసుకోరాదని సూచించారు. అక్రమ ఇసుక రవాణా అరికట్టడానికి సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

Related posts