telugu navyamedia
CBN CM Jagan ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఇసుక, మద్యం వ్యాపారాలే వైసీపీ కి చెడ్డపేరు తీసుకొచ్చాయ: కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.

వైసీపీ నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కూటమి ప్రభుత్వంపై సానుకూల వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చి రెండు నెలల కూడా కాకముందే పథకాలు ఇవ్వడం లేదంటూ విమర్శించడం సరికాదని పేర్కొన్నారు.

ఈ స్వల్ప వ్యవధిలోనే అద్భుతాలు జరిగిపోతాయని భావించడం సరికాదన్నారు. సంపద సృష్టించిన తర్వాతే అమ్మ ఒడి వంటి పథకాలను ఇస్తామని ఎన్నికల్లో చేసిన వాగ్దానాన్ని మర్చిపోకూడదని సొంత పార్టీ నేతలకు హితవు పలికారు.

అందుకోసం ఈ ఏడాది చివరి వరకైనా అవకాశం ఇవ్వాలని సూచించారు.

ఇసుక, మద్యం విషయంలో తమ ప్రభుత్వ విధానాలను కేతిరెడ్డి తప్పుబట్టారు. ప్రభుత్వం పాలన చేయాలి తప్పితే వ్యాపారాలు చేయకూడదని అన్నారు.

దీనికి తాను తొలి నుంచీ వ్యతిరేకమేనని స్పష్టం చేశారు. దీనివల్లే తమ ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందని అభిప్రాయపడ్డారు.

నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా బీసీలు అని జగన్ పదేపదే చెప్పడంతో మిగతా వర్గాలు ఆయనకు దూరమయ్యారని అన్నారు.

ఏది ఏమైనా ప్రభుత్వానికి మనం సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని, కాబట్టి అప్పుడే ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు.

రాష్ట్రంలో ఇటీవల జరిగిన అల్లర్లపైనా కేతిరెడ్డి స్పందించారు. మనం వేసిన బంతి తిరిగి మనకే వచ్చి తగులుతోందని అన్నారు.

ఈ మేరకు తన ఫేస్బుక్ ఖాతాలో వీడియో పోస్టు చేశారు.

Related posts