telugu navyamedia
ఆంధ్ర వార్తలు

కాళ్లు పట్టుకున్నా కనికరించకుండా.. వృద్ధుడిపై సాక్షి రిపోర్టర్ దాడి

గుంటూరు జిల్లా తాడేపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఓ వృద్ధుడిపై సాక్షి దిన‌ప‌త్రిక‌లో విలేక‌రిగా ప‌నిచేస్తున్న నాగిరెడ్డి దాడికి పాల్పడ్డాడు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

పోలకంపాడులో స్థలం ఖాళీ చేసే విషయంలో నాగిరెడ్డి జోక్యం చేసుకుని వృద్ధుడిపై దాడికి పాల్పడ్డాడు. ప్రైవేటు వివాదంలో జోక్యం చేసుకుని వృద్ధుడు కోటేశ్వరావుపై నాగిరెడ్డి విచక్షణారహితంగా దాడి చేశాడు. వృద్ధుడు కాళ్లు పట్టుకుని ప్రాధేయపడినా దయతలచకుండా దాడి చేయడంతో పాటు అడ్డు వ‌చ్చిన‌ అతడి కుటుంబ మ‌హిళ‌ల‌పై దాడికి పాల్పడ్డాడు.

Thumbnail image

నాగిరెడ్డి దాడిని వీడియో తీస్తున్న మహిళలను కాళ్లతో తన్నాడు. ఈ దృశ్యాలు వీడియోలో రికార్డు అయ్యాయి. స్థానికంగా నాగిరెడ్డి దందాలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు , ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు.

“ఇదిగో సాక్షి గూండాల బరితెగింపు….! అది కూడా స్వయంగా సాక్షి యజమాని సీఎం నివశించే తాడేపల్లిలో! ప్రైవేటు వివాదంలో వేలు పెట్టి… వృద్ధుడు, మహిళలపై దాడి. అధికార మదంతో పెట్రేగుతున్న ఇలాంటి మీడియా ముసుగు అరాచకాలను కట్టడి చేయలేరా?” అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

“యధా సాక్షి యజమాని, తథా సాక్షి ఉద్యోగులు. వైసిపి నాయకులు భూ కబ్జాలు, దాడులు, హత్యలతో రెచ్చిపోతుంటే మేమేమైనా తక్కువ తిన్నామా అంటున్నారు సాక్షి సిబ్బంది. మంగళగిరి నియోజకవర్గంలో సాక్షి రిపోర్టర్ నాగి రెడ్డి దాష్టీకం చూస్తుంటే..ఇక ఈ రాష్ట్రంలో సామాన్యులు బ్రతికే పరిస్థితి లేదని అర్థమవుతుంది.

ప్రైవేట్ భూ వివాదంలో జోక్యం చేసుకోవడమే తప్పు అయితే, ఆ స్థలయజమాని అయిన వృద్ధుడు కాళ్ళు పట్టుకొని చంపొద్దని ప్రాధేయపడినా వదలకుండా దాడికి పాల్పడటం దారుణం. అడ్డొచ్చిన మహిళను కాలితో తన్నిన సాక్షి విలేకరి నాగిరెడ్డి అరాచకాలకి అడ్డే లేకుండా పోతోంది” అని లోకేశ్ ఫైర్ అయ్యారు.

Related posts