బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు డిసెంబర్ 6నుంచి ప్రారంభం అవుతాయని తెలిపారు. వివాదాస్పద రామజన్మ భూమి- బాబ్రీ మసీదు స్థల వివాదంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ ముగిసిన సందర్భంగా సాక్షి మహారాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 6వ తేదీనే అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేశారని, మసీదు నిర్మాణం కూల్చి వేసిన తేదీనే ఆలయ నిర్మాణం ప్రారంభం కావడం విశేషమని సాక్షి మహారజ్ తెలిపారు.
కేవలం ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ కృషి వల్లే రామ మందిర నిర్మాణం కల నిజమైందని మహారాజ్ అన్నారు. రామ మందిర్ నిర్మాణానికి హిందూవులు, ముస్లింలు కలిసి రావాలని ఎంపీ పిలుపునిచ్చారు. రామ మందిర నిర్మాణం ఎంతో మంది హిందువుల కలని సాకారం చేస్తుందని, ఈ దీపావళి మాత్రమే కాకుండా దేశం మొత్తం ఏడాదిపాటు పండగ చేసుకుంటుందని మరో బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి అన్నారు. తన పిటిషన్ తర్వాతే అయోధ్య కేసులో సుప్రీంకోర్టు విచారణను వేగవంతం చేసిందని స్వామి తెలిపారు.