దేశంలో రోజురోజుకు నిరుద్యోగం పెరుగుతున్న నేపథ్యంలో యువత నిరుద్యోగ సమస్యతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా తగిన ఉద్యోగాల కల్పన కరువవడంతో చేసేది లేక యువత నిరసనలతో రోడ్డెక్కారు. వివిధ రూపాలలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలంటూ.. గత నాలుగు రోజులుగా సాక్షర భారత్ ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం కూడా కొనసాగుతున్నాయి.
రోజుకో విధంగా వినూత్నంగా నిరసన తెలుపుతున్న సాక్షర భారత్ ఉద్యోగులు ఈ రోజు ఉదయం విజయనగరం పట్టణంలో ఎఐటియుసి ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన తో నిరసన తెలిపారు. సాక్షర భారత్ ఉద్యోగులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తమను ఎలాగైతే అర్థాంతరంగా ఉద్యోగాల నుండి తొలగించిందో.. అదే రీతిలో ఈ అర్ధనగ్న ప్రదర్శన చేశామని తెలిపారు. తమను ఉద్యోగాల నుండి తొలగించిన రాష్ట్ర ప్రభుత్వం తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రదర్శన విజయనగరం మయూరి జంక్షన్ నుండి కాంప్లెక్స్ మీదుగా తిరుమల హస్పటల్ వరకూ కొనసాగింది.