జగన్ పై అక్రమ కేసుల బనాయించినప్పుడు కూడా సజావుగా నడిచిన పార్టీ వైసీపీ అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జైల్లో ఉన్నప్పుడు ఆయన తల్లిగారు నాయకత్వం వహించినప్పుడు కూడా సాఫీగా నడిచిన పార్టీ తమదేనని చెప్పారు.
23 మంది తమ ఎమ్మెల్యేలను పశువులను కొన్నట్టు కొన్నప్పటికీ తమదని చెక్కుచెదరని పార్టీ అని సజ్జల ఉద్ఘాటించారు. ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీ సాధించి ఏడాదిన్నరగా పాలన సాగిస్తున్న పార్టీ తమదని అన్నారు. చెప్పుకోవడానికి ఎన్నో సానుకూలాంశాలు ఉన్న పార్టీ తమదని పేర్కొన్నారు. అలాంటి తమ పార్టీకి ఆలయాలపై దాడులు, రథాలు తగులబెట్టించుకోవాల్సిన అవసరం ఏముందని సజ్జల ప్రశ్నించారు.
ఈ సందర్భంగాచంద్రబాబు పై విమర్శలు గుప్పించారు. అసలేమీ చేయని బాబు పాలన కంటే గవర్నర్ పాలన మేలని భావించిన రోజులు కూడా ఉన్నాయన్నారు. అరటి తోటలు తగులబెట్టించడం, కులాల మధ్య చిచ్చుబెట్టించడం, సినిమా డైరెక్టర్ ను తీసుకెళ్లి పుష్కరాల్లో షూటింగులు చేయించుకోవడం చంద్రబాబుకు అవసరమని దుయ్యబట్టారు. మాకు ఇలాంటివాటితో అవసరమే లేదని చెప్పారు. రోజుకు 30 గంటలు చెప్పుకున్నా తరగనంత మంచిని జగన్ చేస్తున్నారని సజ్జల పేర్కొన్నారు.