మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ బాబీ నిర్మాణంలో ఓ కొత్త సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. మిస్టిక్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందనున్న ఈ సినిమాకు కార్తీక్ దుండు దర్శకుడు. స్టార్ డైరక్టర్ సుకుమార్ ఈ సినిమా నిర్మాణ భాగస్వామిగా ఉండటంతో పాటుగా.. కథ – స్క్రీన్ ప్లే అందిస్తుండటం విశేషం.
తాజాగా ఈ సినిమా వర్కింట్ టైటిల్ ‘ఎస్డీటీ 15’ పేరుతో ఓ కొత్త పోస్టర్ను రిలీజ్ చేసింది. డార్క్మోడ్లో ఉన్న ఈ పోస్టర్లో.. చీకటిగా ఉన్న ఓ దట్టమైన అడవి మధ్యలో తేజ్ కొంతమందితో ఏదో మాట్లాడుతున్నట్లుగా కనిపించారు. ఇది సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది.
చేతబడి ( బ్లాక్ మ్యాజిక్) నేపథ్యంలో కథ, కథనాలు సాగుతాయని సమాచారం. చేతబడికి బలవుతూ అనుమానాస్పదంగా మరణిస్తున్న ఓ గ్రామానికి, ముంబై నుంచి వచ్చే ఇంజనీర్ పాత్రలో సాయి తేజ్ కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఈ మిస్టీరియస్ సంఘటనలను హీరో ఎలా ఛేదిస్తాడు? ఆ సమస్యలను ఎలా పరిష్కరిస్తాడు? అనే ఇతివృత్తంతో ఈ కథ..నడుస్తుందని అని టాక్ వినిపిస్తోంది.
కాగా.. సాయి ధరమ్ తేజ్ గత సెప్టెంబర్లో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. బ్రేక్ తీసుకున్న ఈ మెగా హీరో రెట్టింపు ఉత్సాహంతో కొత్త చిత్రం షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ మూవీ తేజ్ కెరీర్లో 15వది కావడం విశేషం.