వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పై టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని మండిపడ్డారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ తన కుమారుడికి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని విజయమ్మ కోరుతున్నారని.. ఒక్క ఛాన్స్ ఇచ్చి మా పిల్లల్ని జైలు పాలు చేసుకోవాలా? అంటూ యామిని విరుచుపడ్డారు. జగన్ కుటుంబం మొత్తం తేడానే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని వలస పక్షులను పులికాట్ సరస్సు వద్ద చూస్తుంటాం. నిర్ణీతమైన సమయంలోనే అవి బయటకు వచ్చి వెళ్లిపోతుంటాయి. ఇప్పుడు వైఎస్ కుటుంబ సభ్యులు కూడా అలాగే ఉన్నారని ఆమె దుయ్యబట్టారు.
వారి కుటుంబంలో ఒకరో ఇద్దరో తేడా అనుకున్నాం. కానీ కుటుంబం మొత్తం మానసిక పరమైన తేడాను ఎదుర్కొంటున్నారు. మొన్న షర్మిల వచ్చి ఏదో మాట్లాడారు. నిన్న తల్లిగారు విజయలక్ష్మిగారిని దింపారు. ఆవిడ ఒక చేతిలో బైబిల్ పట్టుకుని.. మరో చేతిలో మైక్ పట్టుకుని చెబుతూ ఉంటారు. ‘నా కొడుక్కి ఒక ఛాన్స్ ఇవ్వండి’ అని చెబుతున్నారు.’’ అని యామిని విమర్శించారు. జగన్ కి ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రం కరువు కోరల్లో చిక్కుకుంటుందని ఆమె అన్నారు.