telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

వ్యవసాయం కూడా .. యువతకు ఉపాధి అవకాశం కావాలి .. : సద్గురు జగ్గీ వాసుదేవ్

sadguru jaggi vasudev on young farmers

వ్యవసాయం నుంచి మన యువత తప్పుకోవడంతో అత్యంత సారవంతమైన మన దేశ మట్టిని పోగొట్టుకున్నామని, ఇది ఖచ్చితంగా ప్రమాదకరమైన పరిస్థితి అని యోగి, సద్గురు జగ్గీ వాసుదేవ్ హెచ్చరించారు. జగ్గీ వాసుదేవ్ ఇచ్చిన పిలుపు ‘కావేరీ పిలుస్తోంది’ ప్రజా ఉద్యమానికి అనూహ్య స్పందన లభించింది. ఈ ఉద్యమానికి కర్ణాటక సీఎం యడ్యూరప్ప మద్దతు తెలిపారు. బెంగళూరులో నిర్వహించిన చైతన్య సదస్సులో యడ్యూరప్ప, జగ్గీ వాసుదేవ్, మైసూరు సంస్థాన రాజమాత ప్రమోదాదేవి, ప్రముఖ పారిశ్రామిక వేత్త కిరణ్ మజుందార్ షా పాల్గొన్నారు.

కావేరీలో నీటి లభ్యత క్రమేపీ తగ్గిపోతోందని, అందువల్లే కర్ణాటక, తమిళనాడులో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని జగ్గీ వాసుదేవ్ అన్నారు. నదీ తీరంలో వృక్షాలు పెంచి రైతులకు ఆదాయం పెంచడం లక్ష్యం కావాలని, చెట్లు, పశువులు అటవీ ప్రాంతాల్లో ఉండాలని అన్నారు. యూరియా లాంటి ఎరువుల వాడకం ఇబ్బందుల్లోకి నెడుతోందని, సారవంతమైన భూమిని కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశంలోజలాశయాలు మూడు, నాలుగు రోజుల్లోనే నిండుతున్నాయని, నీరు వేగంగా సముద్రంలోకి వెళ్లిపోయి, మన ప్రాంతాలు ఎడారిగా మారకూడదన్నదే తమ లక్ష్యం అని చెప్పారు. ‘కావేరీ’ ఒక్కటే కాదు 120కి పైగా ఉపనదులు పునర్జీవం కావాలి అని అన్నారు.

Related posts