కరోనా టైమ్లో మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో.. ప్లేయర్లు ఎక్కువ కాలం బయో బబుల్లో ఉండటాన్ని ఆమోదించడం చాలా కీలకమన్నాడు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్. ‘మ్యాచ్కు భౌతికంగానే కాదు మానసికంగానూ సన్నద్ధం కావాలని కాల క్రమంలో తెలుసుకున్నా. నేను మైదానంలో అడుగుపెట్టడానికి చాలా ముందే నా మదిలో మ్యాచ్ మొదలవుతుంది. ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. దాదాపు 10-12 ఏళ్ల పాటు ఆందోళనకు గురయ్యా. మ్యాచ్లకు ముందు ఎన్నో నిద్రలేని రోజులు గడిపా. కానీ ఇది నా సన్నాహంలో భాగమని క్రమంగా ఆమోదించా. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం ఏదో ఒకటి చేసేవాణ్ని. షాడో బ్యాటింగ్, టీవీ చూడడం, వీడియో గేమ్స్ ఆడడం లాంటివన్నమాట. ఉదయం టీ చేసుకోవడం కూడా మ్యాచ్కు సిద్ధం కావడానికి ఉపకరించేది. అలాగే బట్టలు ఇస్త్రీ చేసుకోవడం కూడా. మ్యాచ్కు ఒక రోజు ముందే నా బ్యాట్ సర్దుకునేవాణ్ని. మా అన్న నాకిది నేర్పించాడు. అది అలవాటుగా మారింది. భారత్కు ఆడిన చివరి మ్యాచ్ సందర్భంగా కూడా అదే చేశా” అని మాస్టర్ చెప్పుకొచ్చాడు.