జిల్లాకు చెందిన మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి కేసీఆర్ క్యాబినెట్ లో మంత్రి పదవి దక్కించుకున్నారు. ఆమె మంత్రి హోదాలో తొలిసారి శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు మంత్రికి అపూర్వ స్వాగతం పలికేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం .. హైదరాబాద్ నుంచి బయల్దేరి చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత శంకర్పల్లి పట్టణంలో జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో సీసీ కెమెరాలు, కిచెన్ షెడ్, స్టేజీలను ప్రారంభిస్తారు. చేవెళ్ల మండలం కౌకుంట్ల గ్రామంలో ఉన్న శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటారు.
ఆయా ప్రాంతాల్లో జరిగే బహిరంగసభలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతారు. మూడు మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు,మాజీ ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ మేరకు అందరికీ సమాచారం అందించారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య హాజరుకానున్నారు. తొలిసారి మంత్రి హోదాలో నిర్వహిస్తున్న సభలు కావడంతో నేతలు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు.