తమ డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ ఆర్టీసీ కార్మికులు కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను జేఏసీ నేతలు హైదరాబాద్ లో కలిశారు. అనంతరం ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ… కార్మికుల పట్ల సర్కారు వ్యవహరిస్తున్న వైఖరిని గవర్నర్ కు వివరించామని చెప్పారు. సమ్మె విరమించి ఆర్టీసీ యూనియన్ నేతలు చర్చలకు సిద్ధం కావాలంటూ టీఆర్ఎస్ సీనియర్ నేత కె.కేశవరావు చేసిన వ్యాఖ్యలపై అశ్వత్థామరెడ్డి స్పందించారు.
ప్రభుత్వానికి, ఆర్టీసీ కార్మికులకు మధ్య కేశవరావు మధ్యవర్తిత్వం వహిస్తే మంచిదేనని, చర్చలకు వెళ్లడానికి సిద్ధమని వ్యాఖ్యానించారు. ముందుగా తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గుర్తిస్తామని గతంలో సీఎం కేసీఆర్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. తమ కార్మికుల హక్కుల పరిరక్షణ కోసమే జేఏసీ పని చేస్తోందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పుట్టిన సంఘం ఆర్టీసీ అని, తమకు ఏ రాజకీయ నాయకులతో ఒప్పందాలు లేవని స్పష్టం చేశారు.
దాడులు చేయడం ఈ ప్రభుత్వానికి అటవాటే: గోరంట్ల