సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా పెరుగుతుందో అంతగా మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఎన్నో ఆన్లైన్ మోసాలు బయటపడ్డా ప్రజలు మాత్రం ఇంకా మోసపోతూనే ఉన్నారు. తాజాగా ప్రముఖ గాయని సునీత పేరిట కొందరు కేటు గాళ్లు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.1.7 కోట్లు టోకరా వేశారు. అతను చేసిన ఘరానా మోసం ఒకటి బాధితురాలు రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగు చూసింది. కొత్తపేటకు చెందిన ఓ మహిళ (44) సునీతకు వీరాభిమాని. 2019లో బాధితురాలి ఇంటి దగ్గరుండే చైతన్య అనే వ్యక్తి సునీత వాట్సాప్ నంబర్ ఇదేనని ఒక నంబర్ ఇచ్చాడు. రెండు, మూడు సార్లు వాట్సాప్ లో ఆమె మెసేజ్ చేయగానే సునీత బాధితురాలి నంబర్ను బ్లాక్ చేశారు. దీంతో బాధితురాలు.. వేరే నంబర్ నుంచి సునీత నంబర్ అని చెప్పి చైతన్య ఇచ్చిన నంబర్ కు ‘మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి’ అంటూ మెసేజ్ చేసింది. సరేనంటూ.. అప్పటి నుంచి ఛాటింగ్ చేయడం మొదలుపెట్టారు. ఒకరోజు కేరళలో ‘ఆనంద చేర్లాయం ట్రస్ట్’లో రూ.50 వేలు చెల్లించి సభ్యత్వం తీసుకోవాలని సూచించడంతో బాధితురాలు ఆమె సూచించిన బ్యాంకు ఖాతాకు డబ్బులను బదిలీ చేసింది. అమెరికాలో ఉన్న భూములను అమ్మకానికి పెట్టానంటూ నమ్మించి పలు దఫాలుగా రూ.1.7 కోట్లు బాధితురాలి నుండి వసూలు చేశారు. ఎప్పటికప్పుడు గాయని ఫొటోలు వాట్సాప్లో పంపించే వారు కానీ ఎప్పుడూ వీడియో కాల్ మాట్లాడేవారు కాదు. ఎన్నో మార్లు అడిగిన అనంతరం అనుమానం వచ్చి గాయని వాట్సాప్ నంబర్ ఇచ్చిన చైతన్య మీద ఆమె చీటింగ్ కేసు పెట్టింది. ఇప్పటికే తాను సునీత మేనల్లుడినని చెప్పుకుంటూ చైతన్య అనే వ్యక్తి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.
previous post
next post