దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్స్టార్ రామ్చరణ్ హీరోలుగా రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ “‘రౌద్రం రణం రుధిరం”. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. టాలీవుడ్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా… అజయ్ దేవగన్, శ్రియ, సముద్రఖని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథని అందించారు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా కరోనా వలన వాయిదా పడింది. తాజాగా ఈ మూవీ షూటింగ్ మళ్లీ మొదలైన విషయం తెలిసిందే. సెట్స్లో నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఇతర సిబ్బంది మళ్లీ తమ పనిని మొదలుపెట్టినట్టు చెప్పే చిన్న వీడియోను చిత్ర యూనిట్ మంగళవారం విడుదల చేసింది. కొమరం భీమ్గా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ను అక్టోబర్ 22న విడుదల చేయనున్నట్టు కూడా ఈ వీడియోలో ప్రకటించారు. కొమరం భీమ్ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎన్టీఆర్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నవంబర్ మొదటివారం నుంచి ఈ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారని సమాచారం. హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోన్న షూటింగ్లో ఆమె పాల్గొంటారని, ఆమె షెడ్యూల్ పూర్తయ్యేంత వరకు నగరంలోనే ఉంటారని తెలుస్తోంది. ఈ చిత్రంలో స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కనిపిస్తుండగా.. ఆమె పక్కన సీతగా ఆలియా భట్ నటిస్తున్నారు.
previous post