telugu navyamedia
క్రీడలు వార్తలు

బెంగుళూర్ కు షాక్.. సైనికి గాయం…

ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌ రేసుకు స్వల్ప దూరంలో నిలిచిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరును ఆ జట్టు పేసర్‌ నవదీప్‌ సైనీ గాయం కలవర పరుస్తోంది. ఆదివారం సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో సైనీ గాయపడటంతో అతను తదుపరి మ్యాచ్‌లకు ఉంటాడా.. లేదా అనేది అనుమానంగా మారింది. నిన్నటి మ్యాచ్‌లో సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో భాగంగా 18వ ఓవర్‌ వేస్తున్న సందర్భంలో సైనీ కుడి చేతి బొటన వేలికి గాయమైంది. దాంతో సైనీ మైదానాన్ని వీడాడు. ఎంఎస్‌ ధోని స్టైట్‌గా కొట్టిన షాట్‌ను ఆపే ప్రయత్నంలో సైనీ బొటన వేలు మధ్యలో చీలిక వచ్చింది. ఇదే ఇప్పుడు ఆర్సీబీని డైలమాలోకి నెట్టేసింది. కీలక మ్యాచ్‌లకు ముందు సైనీ గాయపడటంతో శిబిరంలో ఆందోళన నెలకొంది.

ఆర్సీబీ జట్టులో ప్రధాన పేసర్‌ సైనీ కావడంతో తదుపరి మ్యాచ్‌లకు అతను అందుబాటులో ఉంటాడో..లేదా అనేది చర్చనీయాంశమైంది. దీనిపై ఆర‍్సీబీ చీఫ్‌ ఫిజియోథెరపిస్ట్‌ ఇవాన్‌ స్పీచ్‌లీ మాట్లాడుతూ.. ‘సైనీ కుడి చేతి బొటన వేలి మధ్యలో చీలిక వచ్చింది. మాకు మంచి సర్జన్‌ ఉండటంతో సైనీకి కుట్లు వేశాడు. అతని గాయాన్ని పర్యవేక్షిస్తూనే ఉన్నాం. ఆర్సీబీ ఆడబోయే తదుపరి మ్యాచ్‌ల్లో సైనీ ఆడతాడా.. లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. దీనిపై త్వరలోనే క్లారిటీ వస్తుంది. గాయం నయమవుతుందనే అనుకుంటున్నాం’ అని స్పీచ్‌లీ తెలిపాడు.

అదే సమయంలో నాలుగేళ్ల క్రితం జరిగిన ఐపీఎల్‌లో కూడా విరాట్‌ కోహ్లి ఇదే తరహాలో గాయపడ్డాడని, ఆ గాయం మానిన తర్వాత బరిలోకి దిగిన కోహ్లి సెంచరీ కూడా చేశాడని స్పీచ్‌లీ తెలిపాడు. ఆ గాయానికి ఈ గాయానికి కొద్దిపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ఈ రెండింటిని ఒకే తరహాలో ట్రీట్‌ చేయాలేమన్నాడు. సైనీకి అయిన గాయం బౌలింగ్‌ చేతికి కావడంతో ఒత్తిడి ఎక్కువగా పడుతుందన్నాడు. దాంతోనే అతను తదుపరి మ్యాచ్‌ల్లో పాల్గొనే విషయం ఇంకా చెప్పలేకపోతున్నామని తెలిపాడు.

Related posts