ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటానని తన వంతు సాయం చేస్తానని వైసీపీ నగరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి రోజా అన్నారు. బుధవారం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతూ నాలుగున్నర ఏళ్లు మహిళలను మోసం చేసిన చంద్రబాబును ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. మహిళలకు అండగా నిలిచే పార్టీ వైసీపీ అని స్పష్టం చేశారు.
నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా తన ఇంటి తలుపు తట్టవచ్చని చెప్పారు పసుపు కుంకుమ పేరిట ఇచ్చే తాయిలాలకు ఎవరూ మోసపోవద్దని సూచించారు. మన భవిష్యత్ బాగుండాలంటే మహిళా సాధికారత సాధ్యం కావాలంటే జగనన్నను గెలిపించాలని కోరారు. వైసీపీకి అధికారం అప్పగిస్తే నాలుగు దఫాలుగా డ్వాక్రా రుణమాఫీ చేస్తామని అన్నారు. వడ్డీలేని రుణాలు అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పిల్లల్ని చదివించే తల్లులకు సంవత్సరానికి రూ.15వేలు వారి ఖాతాల్లోనే జమ చేస్తామని రోజా అన్నారు.