రైతుల కోసం కాంగ్రెస్ ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చిందని, దేశంలో హరిత విప్లవం తీసుకొచ్చిందీ కాంగ్రెసేనని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని టీఆర్ఎస్ నేతలు చేసిన విమర్శలకు ఆయన సమాధానమిచ్చారు.
న్యూఢిల్లీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పథకాలపై చర్చకు తాము సిద్దంగా ఉన్నామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఏ అంశంపై చర్చకు వస్తారో కేటీఆర్ చెప్పాలని రేవంత్ రెడ్డి కోరారు.
కేటీఆర్ ను చూస్తే జాలేస్తుంది అని పేర్కొన్న రేవంత్ రెడ్డి కేటీఆర్ విలాసవంతమైన టూర్లకు వెళ్లొచ్చి కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ఏం చేసింది, దేశం కోసం ఏం చేసింది అంటూ డ్రామారావు ఎదురు దాడి చేస్తున్నారని మండిపడ్డారు.
అమెరికాలో విహార యాత్రకు వెళ్లి వచ్చిన కేటీఆర్ తాను రాష్ట్రానికి వచ్చినట్టుగా ప్రజలకు తెలిపేందుకే రాహుల్ పై విమర్శలు చేశారన్నారు. రాహుల్గాంధీ పై టీఆర్ఎస్ విమర్శలు సరికాదన్నారు.
డ్రామారావుకు కాంగ్రెస్ చరిత్ర, దేశ చరిత్రపై ఎలాంటి అవగహన లేదని విమర్శించారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని, రైతులను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామన్న ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
కష్టకాలంలో రైతులకు అండగా నిలిచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ అని రేవంత్ రెడ్డి చెప్పారు. రుణమాఫీ చేసి రైతు కుటుంబాలను ఆదుకున్న చరిత్ర కాంగ్రెస్ దేనని ఆయన చెప్పారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణ ప్రాధాన్యతను 2004లో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఏపీలోనే చేపట్టిందని రేవంత్ రెడ్డి వివరించారు.
రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ఎంతగా పాటుపడిందో పాపం మీకు తెలియదేమో.. కాంగ్రెస్ చేసింది ఏంటో మీ నాయన కెసిఆర్ ని అడగండి చెబుతారు అంటూ పేర్కొన్న రేవంత్ రెడ్డి అయినా రైతుల సమస్యలను పరిష్కరించకుండా రాజకీయం చేయడంలో ఆయన బిజీగా ఉండి ఉంటారు అంటూ రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు.
బాయిల్డ్ రైస్ సరఫరా చేయబోమని కేసీఆర్ సంతకం పెట్టారని, సమస్య జఠిలం అవ్వడానికి సీఎం వైఖరే కారణమని రేవంత్ రెడ్డి విమర్శించారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలాడుతున్నాయని దుయ్యబట్టారు. ప్రతిగింజ కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని ఆయన ఆన్నారు.
తెలంగాణలోటీఆర్ ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుల రీ డిజైన్ల పేరుతో ప్రాజెక్టుల నిర్మాణంలో నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని విమర్శించారు. ఎన్నో చోట్ల సవరణలు చేసి పంటలకు మద్దతు ధర కల్పించామని, ప్రాణహిత చేవెళ్ల పేరు మార్చి రకరకాల పేర్లతో దోపిడీ చేస్తున్నారని రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు.