తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో ఎన్నికల వ్యుహాకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పీకే-కేసీఆర్ భేటీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీఆర్ఎస్తో తెగదెంపులు చేసుకునేందుకే పీకే.. కేసీఆర్ను కలిశారని అన్నారు. ఇకపై ప్రశాంత్ కిషోర్కు టీఆర్ఎస్కు ఎలాంటి సంబంధం ఉండదని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ వ్యూహకర్తగా ఉంటే మేం పార్టీలో చేర్చుకోమని కాంగ్రెస్ అధిష్టానం కండిషన్ పెట్టిందన్నారు రేవంత్రెడ్డి..
ఇక, ఓడిపోతామనే భయంతోనే సీఎం కేసీఆర్ వ్యుహాకర్తను పెట్టుకున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఎవరితో పొత్తు లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికే స్పష్టం చేశారని తెలిపారు. మే 6వ తేదీన వరంగల్లో జరిగే సభలో రాహుల్ గాంధీ ఇదే అంశంపై స్పష్టత ఇస్తారని అన్నారు.
మరోవైపు, కేసీఆర్తో నడిచే ఎవరిని కూడా మేం దగ్గరకు రానివ్వమని.. తెలంగాణలో గుండుకు, అరగుండు ఏమి ఉంది? అంటూ బీజేపీ నేతలపై సెటైర్లు వేశారు.. సర్వేల్లో ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన రిపోర్ట్తో కాంగ్రెస్కు పట్టున్న జిల్లాల్లో బండి సంజయ్ తిరుగుతున్నాడు అని ఆరోపించారు…
కేసీఆర్ ఇచ్చిన డబ్బులతో బండి సంజయ్ సభలు పెట్టిండు.. అక్కడ జనం లేక సభలు వెలవెల బోవడం దేనికి సంకేతమో జనం తెలుసుకున్నారని వ్యాఖ్యానించారు రేవంత్రెడ్డి.