telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆసియా పసిఫిక్ ప్రాంతంలో గూగుల్ మొదటి సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు  ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఆసియా పసిఫిక్ ప్రాంతంలో గూగుల్ మొదటి సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ (GSEC)ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.

ఇది ప్రపంచంలో ఐదవది మాత్రమే అని తెలిపారు. గూగుల్ ప్రారంభించినప్పటి నుంచి ప్రపంచం మారిపోయిందని  నేడు మన జీవితాలు పూర్తిగా డిజిటల్‌గా మారాయన్నారు.

గోప్యత, భద్రత గురించి నేడు ఆందోళన చెందుతున్నామని తెలిపారు.

‘మన ఆర్థిక వ్యవస్థ, మన ప్రభుత్వం, మన జీవితాలు డిజిటల్‌గా మారాయి. డిజిటల్ సురక్షితంగా ఉంటే, మనం మరింత అభివృద్ధి చెందుతాము’ అని చెప్పుకొచ్చారు.

అధునాతన సైబర్ సెక్యూరిటీ , భద్రతా పరిష్కారాల కోసం గూగుల్ ఈ సైబర్-సెక్యూరిటీ హబ్‌ను ఉపయోగిస్తున్నందుకు గర్విస్తున్నట్లు తెలిపారు. ఇది నైపుణ్య అభివృద్ధిపై దృష్టి పెడుతుందన్నారు.

ఉపాధిని సృష్టించడంతో పాటు దేశం సైబర్ భద్రతా సామర్థ్యాన్ని పెంచుతుందన్నారు. చెడు చేయవద్దన్నది గూగుల్ సంస్థ సిద్ధాంతమని.. ఈ విధానాన్ని తాను ఇష్టపడుతున్నట్లు తెలిపారు.

గూగుల్‌లా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మంచిని మాత్రమే చేస్తుందని నమ్ముతున్నానన్నారు. ఈ విధానం వల్ల ప్రయోజనాలు కొంత నెమ్మదిగా కనిపిస్తాయని అయితే మనం దీర్ఘకాలికంగా దృష్టి పెట్టి పని చేయాలని సూచించారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు ఉత్తమ పెట్టుబడికి అనుకూల రాష్ట్రం కోసం శోధిస్తే దానికి సమాధానం తెలంగాణ అని వస్తుందన్నారు.

సెర్చ్‌లో మొదటి లింక్ హైదరాబాద్ వస్తుందని సీఎం అన్నారు. దీనిని తెలంగాణ రైజింగ్ అని పిలుస్తామని  2035 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలనుకుంటున్నట్లు చెప్పారు.

1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనుకుంటున్నట్లు తెలిపారు.

గూగుల్ ఆఫీస్ పక్కన రెండున్నర ఎకరాల్లో స్వయం సహాయక సంఘాల మహిళల కోసం స్టాల్స్ ఏర్పాటు చేశామని రైతులను సంపన్నులుగా తయారు చేయడంతో పాటు సంతోషంగా ఉంచాలనుకుంటున్నామని తెలిపారు.

యువతలో నైపుణ్యాలు పెంచడంతో పాటు వారికి ఉపాధి కల్పించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. అందుకు గూగుల్ మద్దతు కావాలని.. తెలంగాణ రైజింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా కావాలని కోరుకుంటున్నామన్నారు.

గూగుల్, హైదరాబాద్ పాత స్నేహితులన్నారు. 2007లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గూగుల్ తన మొదటి కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు.

దాదాపు 7,000 మంది గూగుల్ ఉద్యోగులు నేడు హైదరాబాద్‌ను తమ ఇల్లుగా భావిస్తున్నారన్నారు.

తెలంగాణలో ప్రతీ సంవత్సరం 1.10 లక్షల ఇంజనీర్స్ కాలేజ్‌ల నుంచి వస్తున్నారని చాలా మంది విద్యార్థులకు నైపుణ్యం ఉండడం లేదన్నారు.

విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపు కోసం ఆనంద్ మహీంద్రా నేతృత్వంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు.

పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అందరికీ ఆరోగ్యం తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఇవే తన ప్రధాన ఆవిష్కరణలన్నారు. ‘గూగుల్ లాగానే, నా ప్రభుత్వంలో భాగస్వాములైన మహిళలు, యువత, రైతులు, పేదలు, మధ్యతరగతి, సీనియర్ సిటిజన్లు, పిల్లలకు ఉన్నతమైన జీవన ప్రమాణాలు కల్పించాలని కోరుకుంటున్నాను.

మనం కలిసి గొప్ప ప్రమాణాలను సృష్టిద్దాం. హైదరాబాద్‌లో మీ కొత్త సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు చేసినందుకు మరోసారి అభినందిస్తున్నాను. మేం గర్వపడేలా మీరు పనిచేస్తారని విశ్వసిస్తున్నాను’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Related posts