నేడు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి సిద్దిపేటలో మరోసారి కేసీఆర్ పై భగ్గుమన్నారు. నమ్మినవాళ్లను నట్టేట ముంచడం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు వెన్నతో పెట్టిన విద్య అని, ఇప్పటి వరకు ఎంతోమందితో ఆడుకున్న ఆయన తాజాగా హరీశ్రావును లక్ష్యంగా చేసుకున్నారని రేవంత్రెడ్డి విమర్శించారు. ఓ కేసుకు సంబంధించి హాజరయ్యేందుకు ఈరోజు సిద్ధిపేట వచ్చిన రేవంత్ మీడియాతో మాట్లాడుతూ, ఈవిధమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
హరీశ్ది ముగిసిపోయిన అధ్యాయమని, తెరాస లో ఆయనను కార్యకర్త కంటే ఘోరంగా చూస్తారని అన్నారు. సిద్ధిపేట నుంచి పోటీ చేయడం కూడా బహుశా ఇదే ఆఖరిసారి కావచ్చని, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఆయనకు టికెట్టు కూడా ఇవ్వరని జోస్యం చెప్పారు. 16 మంది ఎంపీలను గెలిపించి ఇస్తే కేంద్రంతో పోరాడి ఏదో సాధించేస్తానని చెబుతున్న కేసీఆర్, ఇన్నాళ్లు ఏం చేశారని ప్రశ్నించారు. విభజన హామీలు సాధించారా? కాళేశ్వరానికి కనీసం జాతీయ హోదా తెచ్చారా? అన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికలు రాహుల్, మోదీ మధ్య మాత్రమే పోటీ అని రేవంత్ అన్నారు.