జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ బార్య రేణు దేశాయ్ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో అనేక ఆసక్తికరమైన విషయాలను గురించి ప్రస్తావించారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా వుండే రేణు దేశాయ్ అనేక విషయాలను వెల్లడించారు. “నేను మోడలింగ్ చేసే దానిని .. అందుకు సంబంధించిన ఫోటో ఒకటి పూరి జగన్నాథ్ గారి కంటపడింది. దాంతో ఆయన ‘బద్రి’ సినిమాలో చేయమని అడిగారు.
నిజానికి నాకు యాక్టింగ్ అంటే ఇష్టం లేదు. దర్శకత్వంపైనే ఎక్కువగా ఆసక్తి ఉండేది. పవన్ కల్యాణ్ పేరే నేను అప్పటికి వినలేదు. అందువలన మొదట కుదరదని చెప్పేశాను. కానీ పూరి గారు ఒప్పించారు. అయితే సినిమా షూటింగుకి ముందు హీరోతో ఒకసారి మాట్లాడాలని చెప్పాను. అలా మొదటిసారిగా ‘తమ్ముడు’ సినిమా షూటింగు సమయంలో హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పవన్ కల్యాణ్ ను చూశాను. అక్కడే మా పరిచయం జరిగిందని రేణు దేశాయ్ చెప్పారు.