నోట్ల రద్దు అనంతరం కొత్తగా ప్రవేశపెట్టిన రూ.2వేల నోటుకు సంబంధించి జాతీయ మీడియాలో పలు కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ స్పందించారు. కావాల్సిన దాని కన్నా ఎక్కువే ప్రభుత్వం వద్ద రూ.2 వేల నోట్లు ఉన్నాయని గార్గ్ తన ట్వీట్లో తెలిపారు. 2వేల నోటు ముద్రణకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం కావాల్సినంత నోట్లు చెలామణిలో ఉన్నాయని అన్నారు.
పన్నుల ఎగవేతకు, అక్రమ ఆస్తులు దాచిపెట్టేందుకు 2వేల రూపాయల నోట్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారని ప్రభుత్వం భావిస్తుంది. దీనిని ఆరికట్టేందుకు కేంద్రం 2వేల రూపాయల నోట్ల ముద్రణను నిలిపివేసింది. దీనిపై ఆర్బీఐ మాత్రం ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. 2016 నవంబర్లో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న బీజేపీ సర్కార్.. అప్పుడు వాడుకలో ఉన్న 1000, 500 రూపాయల నోట్లను రద్దుచేసింది. వాటి స్థానంలో 2వేల రూపాయల నోటును తీసుకువచ్చింది. కాగా, గత కొంతకాలంగా రెండు వేల రూపాయల నోట్లను కేంద్రం ఉపసంహరించనుందనే ప్రచారం విస్తృతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.