మాస్ మహారాజా రవితేజ, బ్లాక్బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం `క్రాక్`. డాన్శీను, బలుపు చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రమిది. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా అన్ని ఎలిమెంట్స్తో డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సముద్రఖని, వరలక్ష్మి శరత్కుమార్ పవర్పాత్రల్లో నటిస్తున్నారు.
శివరాత్రి సందర్భంగా `క్రాక్` సినిమా టీజర్ విడుదల చేశారు చిత్ర యూనిట్. “ఒంగోల్ లో రాత్రి ఎనిమిది గంటలకు కరెంట్ పోయిందంటే కచ్ఛితంగా మర్డరే..అనే వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అయిన టీజర్ ఆద్యంతం ఉత్కఠభరితంగా సాగింది. అప్పిగా, తుప్పిగా, నువ్వు ఎవరైతే నాకేంట్రా డొప్పిగా…” అంటూ తనదైన మ్యానరిజంతో రవితేజ చెప్పే డైలాగ్ సినిమాపై అంచనాలను పెంచింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ – ” మహా శివరాత్రి సందర్భంగా విడుదల చేసిన టీజర్ కి అన్ని వర్గాల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. సమ్మర్ స్పెషల్ గా మే 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. రవితేజ నుండి మీరు ఆశించే అన్ని అంశాలు ఉంటాయి. టీజర్ లో చూసింది చాలా తక్కువ సినిమాలో ఇంకా చాలా ఉంటుంది. మా యూనిట్ కి మంచి కమర్షియల్ సినిమా అవుతుందని ఆశిస్తున్నాం. మా డి ఒ పి విష్ణు అధ్బుతమైన విజువల్స్ అందించారు. టీజర్ లాగే మూవీలో కూడా తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోతుంది. సినిమా కచ్చితంగా ఆకట్టుకుంటుంది అని నమ్ముతున్నాం” అన్నారు.