ఇంగ్లీష్ గడ్డపై భారత్ అదరగొట్టేలా.. కోచ్ రవిశాస్త్రి కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బ్యాట్స్మెన్ భారీ శతకాలు చేసేలా శిక్షణా పద్ధతుల్లో మూడు కొత్త మార్పులు చేస్తున్నారని తెలిసింది. ఇంగ్లండ్ పర్యటనలో రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, చెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, రిషబ్ పంత్ శతకాలు చేయడం అత్యంత కీలకం. ప్రతి మ్యాచులో కనీసం ఇద్దరు ఆటగాళ్లు మూడంకెల స్కోరును అందుకొంటే భారత్ సునాయాసంగా విజయం సాదించగలదు. ఇందుకోసం రవిశాస్త్రి మూడు ప్రణాళికలు సిద్ధం చేశారట. నెట్స్లో బ్యాటింగ్ చేసేటప్పుడు పిచ్ పొడవును 22 నుంచి 16 గజాలకు తగ్గించడం మొదటిది. పిచ్ పొడవును తగ్గించడంతో వేగంగా వస్తున్న బంతులను ముందుగానే ఆడాల్సి ఉంటుంది. తక్కువ సమయంలోనే ఎలాంటి షాట్ ఆడాలో వేగంగా నిర్ణయం తీసుకొనేందుకు అది ఉపయోగపడుతుంది. ఒకవైపు నునుపు తేలిన బంతులతో ముందుగానే సాధన చేయించడం రెండోది. దీంతో నునుపు బంతులు ఎలా పిచవుతున్నాయో ముందే గుర్తించవచ్చు. నునుపు తేలిన బంతులు ముందుగా ఆడటం వల్ల పరిస్థితులపై అవగాహన కలుగుతుంది. బంతిని ఆడాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉండకుండా వదిలేసేలా శిక్షణ ఇవ్వడం మూడోది. ఇంగ్లండ్లో స్వింగ్ అయ్యే బంతులను వదిలేయడం చాలా అవసరం. ఈ కళ నేర్చుకొంటే.. తికమక పడకుండా స్థిరంగా బంతులు వదిలేయవచ్చు. ఈ మూడు పద్ధతులకు కోహ్లీసేన అలవాటు పడితే.. మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
previous post
next post