సాధారణంగా ఏ భాషలోనైనా స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతున్నాయంటే థియేటర్ల ముందు భారీ కటౌట్ల ఏర్పాటు, వాటికీ పాలాభిషేకం చేయడం చూస్తూనే ఉంటాము. అయితే హీరోయిన్లకు పాలాభిషేకం అనేది చాలా అరుదు. తాజాగా ఏ హీరోయిన్ కటౌట్ కు పాలాభిషేకం చేశారు అభిమానులు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. కన్నడంలో “కిర్రాక్ పార్టీ” సినిమాతో క్రేజ్ సంపాదించుకుంది హీరోయిన్ రష్మిక మందన్న. తెలుగులో ఛలో, గీతగోవిందం సినిమాలతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది రష్మిక. తాజాగా రష్మిక నటించిన “యజమాన”చిత్రం మార్చి 1న థియేటర్లలోకి వచ్చింది. కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ ఈ సినిమాలో హీరోగా నటించారు. ఈ క్రమంలోనే థియేటర్ల ముందు రష్మికకు సంబంధించిన భారీ కటౌట్లు ఏర్పాటు చేసి, పాలాభిషేకం చేశారు అభిమానులు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం రష్మిక తెలుగులో “డియర్ కామ్రేడ్” సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటిస్తోంది. మేలో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
previous post