సోషల్ మీడియా వేదికగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ సోదరి రంగోలి చేసే హంగామా అంతా ఇంతా కాదు. గతకొంతకాలంగా ట్వీట్స్ ద్వారా బాలీవుడ్ ప్రముఖులపై విమర్శలు గుప్పిస్తూ వార్తలో నిలిచింది రంగోలి. కంగనా సోదరి, ఆమె పర్సనల్ మేనేజర్ అయిన రంగోలీ సోషల్ మీడియాలో తన చెల్లెలు గురించి పబ్లిసిటీ చేస్తూనే ఉంటుంది. కంగనాకు ఎవరైనా ఏమన్నా అన్నారంటే ఇక వారి సంగతి అంతే. బోల్డ్ క్వీన్ కంగనా రనౌత్ ఎంత పాపులారిటీ సంపాదించుకుందో.. ఆమె సోదరి రంగోలీ కూడా తన వివాదాస్పద వ్యాఖ్యలతో అంతే ప్రాచుర్యం దక్కించుకుంది. ఇప్పటివరకు హృతిక్ రోషన్, ఆలియా భట్, రణ్వీర్ సింగ్, కరణ్ జోహార్, మహేష్ భట్ వంటి ప్రముఖులను టార్గెట్ చేసిన రంగోలీ.. తాజాగా `గల్లీబాయ్` సినిమాపై విమర్శలు కురిపించింది. రణవీర్ సింగ్, అలియా భట్ జంటగా జోయా అక్తర్ రూపొందించిన ఈ చిత్రం ఈ ఏడాది ఫిబ్రవరి 14న విడుదలై సూపర్హిట్గా నిలిచింది. ఈ చిత్రం భారత్ తరఫున 2020 ఆస్కార్ ఎంట్రీ దక్కించుకుంది. అయితే ఆస్కార్ నామినేషన్స్ జాబితాలో `గల్లీబాయ్`కు చోటు దక్కలేదు. దీంతో ఈ సినిమాపై రంగోలీ విమర్శలు చేసింది. “యురి”, “మణికర్ణిక” సినిమాల్లాగా “గల్లీబాయ్” ఒరిజినల్ కథ కాదు. “8 మైల్” అనే హాలీవుడ్ సినిమా ఆధారంగా “గల్లీబాయ్”ను తెరకెక్కించారు. కాపీ సినిమాకు అవార్డు ఎందుకిస్తారు? ఇలాంటి చిత్రాన్ని ఆస్కార్ ఎంట్రీకి పంపిన విమర్శకులకు ఎంతిచ్చారో ఎవరికి తెలుసు?” అంటూ రంగోలీ ట్వీట్ చేసింది.