ఎనర్జిటిక్ హీరో రామ్ ఇటీవల “ఇస్మార్ట్ శంకర్” చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. రామ్, నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం “ఇస్మార్ట్ శంకర్”. జులై 18న విడుదలైన ఇస్మార్ట్ శంకర్ 38 కోట్లకు పైగా షేర్ చేసి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్ర విజయం రామ్కి మంచి ఎనర్జీ ఇచ్చింది. అదే ఉత్సాహంతో తన 18వ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ 18వ సినిమా రూపొందనుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన నేను శైలజ, ఉన్నది ఒక్కటే జిందగీ వంటి ప్రేమ కథా చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా తడమ్ అనే తమిళ యాక్షన్ థ్రిల్లర్ మూవీని తెలుగులో రీమేక్ చేసేందుకు సిద్దం అయ్యాడు. స్రవంతి బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేయబోతున్నాడు. తమిళంలో మగిల్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అరుణ్ విజయ్ ద్విపాత్రాభినయం చేశాడు. ఇప్పుడు రామ్ కూడా తెలుగు రీమేక్లో డబుల్ రోల్ పోషించనుండగా, తొలి సారి రెండు పాత్రలు పోషిస్తున్న రామ్ ఎలా అలరిస్తాడో చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ చిత్రంలో రామ్కి జోడీగా నివేదా పేతురేజ్ .. మాళవిక శర్మ నటించనున్నారు. వచ్చే వేసవిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ చిత్రంతో పాటు మలయాళ మూవీని రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడట రామ్. అనురాజ్ మనోహర్ దర్శకత్వంలో ఇష్క్ అనే మలయాళ చిత్రం తెరకెక్కగా, ఈ చిత్రం లవ్ థ్రిల్లర్గా మంచి విజయాన్ని సాధించింది. ఈ క్రమంలో ఇష్క్ మూవీని స్రవంతి ఆర్ట్స్ బ్యానర్, ఈ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ కలయికలో రూపొందించే అవకాశాలు కనిపిస్తున్నాయి.