మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్పై రామ్చరణ్ నిర్మాతగా సురేందర్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ హిస్టారికల్ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా, రవికిషన్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద రికార్డులను క్రియేట్ చేస్తూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరూ నటీనటులపై, సాంకేతిక నిపుణులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రేక్సకులకు థ్యాంక్స్ తెలిపేందుకు చిత్రయూనిట్ ప్రెస్మీట్ను నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ మాట్లాడుతూ.. “ముందుగా సినిమాను అందరూ ఓన్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. పరుచూరిగారి ఆలోచనలకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే సాయిమాధవ్ బుర్రాగారి డైలాగులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. సాంకేతిక నిపుణులందరూ ఈ చిత్రం కోసం ఎంతగానో కష్టపడ్డారు. రత్నవేలుగారు ‘రంగస్థలం’ చిత్రానికి పని చేశారు. దాంతో నాన్నగారు అడగమంటే అడిగాను ఆయన వెంటనే ఓకే చేశారు. అలాగే రాజీవ్గారు ఈ చిత్రం కోసం దాదాపుగా 40 సెట్స్ వేశారు. నేను ఈ పనులన్నీ చూసుకుంటూ ఉంటే.. అక్క హనీ కూడా డాడీని సెట్స్లో చాలా బాగా చూసుకుంది. అన్ని పనుల్లోనూ బాగా కష్టపడింది. హనీ అక్కకు విద్యా అక్కకు చాలా థ్యాంక్స్. జగపతిబాబుగారు చాలా మంచి మనిషి. ఆయన గురించి ఇండస్ట్రీలో చాలా మంది మంచిగా చెప్పారు. ఇప్పుడు నేను స్వయంగా చూశాను. చాలా మంచి మనిషి. అందుకే ఆయనంటే మాకు చాలా అభిమానం. నయనతార కూడా సినిమాలో చాలా బాగా నటించింది. మై ఫేవరెట్ యాక్టర్ తమన్నా చాలా బాగా చేసింది థ్యాంక్యూ సోమచ్. మా యూనిట్ అందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా ఇంత భారీ తారాగణాన్ని, సాంకేతిక నిపుణులను ఎంతో ఓపికగా మెయింటైన్ చేసిన మా దర్శకుడు సురేందర్కి చాలా థ్యాంక్స్. ఈ సినిమా కోసం ఆయన పడిన కష్టం మాటల్లో చెప్పలేను. షూటింగ్ లేకపోతే నాకు అర్ధరాత్రి 3 గంటలకి మెలకువ వచ్చి నిద్ర పట్టేదికాదు. ఒక్కోసారి ఉలిక్కిపడి లేచేవాడిని. ఉపాసన కూడా ఏమయింది అని అడిగేది. ఏదో టెన్షన్లో ఉండేవాడిని. అప్పుడు నాకు ప్రొడ్యూసర్స్ టెన్షన్ ఏంటో అర్ధమయింది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా నాన్నగారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అభిమానులకు, ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు..’’ అన్నారు. పరుచూరి బ్రదర్స్, జగపతిబాబు, దిల్ రాజు, సాయిమాధవ్ బుర్రా, కమల్కణ్ణన్, సుస్మిత, విక్కీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.