రాఖీ పౌర్ణమి, రక్షాబంధన్, రాఖీగా పిలవబడే ఈ పండుగ ..సోదర సోదరీమణుల అనురాగం… ఆప్యాయతలకు ప్రతీక రాఖీ పండుగ.. ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు.
రాఖీ పౌర్ణమి, రక్షాబంధన్, రాఖీగా పిలవబడే ఈ పండుగ అన్న,చెళ్లెల్లు… అక్క,తమ్ముళ్లు ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ రాఖీ పండుగ. తోడబుట్టిన వారు జీవితాంతం తమకు అండగా ఉండాలని, ప్రతీ క్షణం రక్షణ కల్పించాలని కోరుతూ ఆడపడుచులు అన్నతముళ్లకు రాఖీ కడతారు. సోదరి కట్టిన రక్షాబంధనాన్ని స్వీకరించిన అన్న తానెప్పుడూ చెల్లెలికి రక్షగా ఉంటానని రక్షా బంధనం ద్వారా తెలియజేస్తారు . అంతటి పండుగను దేశంలో అన్ని మతాల వారూ జరుపుకుంటున్నారు.
ముఖ్యంగా హిందువులకు ప్రధానమైన పండుగల్లో ఇదీ ఒకటి. దీనికి చారిత్రక ప్రాశస్త్యం ఉండటం వలన.. ఈ రోజుల్లో రక్షా బంధన్ కి ఎంతో ప్రాధాన్యం ఉంది.ఈ సంవత్సరం ఆగస్ట్ 11న ఎక్కువ మంది ఈ పండుగను జరుపుకుంటున్నారు.
భద్రా సమయంలో రాఖీ కట్టరాదు
2022 ఆగస్టు 11న రాఖీ పౌర్ణమి ముహూర్తం మొదటి సగం వరకు ఉంటుందని దృక్ పంచాంగ్ పేర్కొంది. ఇది ఆగస్టు 11వ తేదీ రాత్రి 8:51 గంటలకు ముగుస్తుంది. శాస్త్రాల ప్రకారం, భద్రా (రాత్రి) సమయంలో రాఖీ కట్టకూడదు, ఎందుకంటే ఇది హానికరమైన సమయం అని నమ్ముతారు. దీనిలో ఎటువంటి శుభ కార్యాలు చేయకూడదు అని చెప్తున్నారు.
రాఖీని ఆగస్టు 11వ తేదీ రాత్రి 8:51 గంటల తర్వాత మరియు 12 ఆగస్టు వరకు పూర్ణిమ తిథి సమయంలో అంటే ఉదయం 7:16 గంటల వరకు కట్టవచ్చు. కానీ రాత్రి సమయంలో రాఖీ కట్టకూడదని భావిస్తున్నారు. సూర్యమానం ప్రకారం సూర్యోదయం సమయంలో ఉండే తిధిని ప్రామాణికంగా తీసుకుని 12వ తేదీ జరుపుకోవాలని కొందరు పండితులు చెప్తున్నారు.
రాఖీ పండుగ వెనుక ఉన్న చరిత్ర ఇదే
పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య చాలా కాలంపాటు యుద్ధం సాగింది. దాదాపు పుష్కర కాలం పాటు సాగిన యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు, అమరావతిలో తలదాచుకున్నాడట. భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి రాక్షసులను ఓడించటానికి తరుణోపాయం ఆలోచిస్తుంది. భర్త దేవేంద్రుడికి యుద్ధం చేయాలనే ఉత్సాహాన్ని కల్పించాలని సంకల్పిస్తుంది. అయితే సరిగ్గా ఆ రోజే శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించి ఇంద్రాణి రక్షను దేవేంద్రుడు చేతికి కడుతుంది . ఇక దేవతలందరూ కూడా ఆ రక్షలను ఇంద్రుడి చేతికి కట్టి యుద్ధానికి పంపిస్తారు. అలా వెళ్ళిన ఇంద్రుడు యుద్ధంలో గెలిచి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సంపాదిస్తాడు. ఆ విధంగా ప్రారంభమైంది రక్షాబంధనం. అప్పటినుండి ఇప్పటివరకు రాఖీ పండుగ ప్రతి ఒక్కరు జరుపుకునే పండుగగా మారింది.
ద్రౌపదీ శ్రీకృష్ణుల కథ..
దేవదానవుల యుద్ధంతో మొదలైన రాఖీ పండుగ నాటి నుండే ఆచారంగా కొనసాగుతుంది. ఈ కథ మాత్రమే కాదు రక్షాబంధనం గురించి ఇంకా బోలెడన్ని పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. శ్రీకృష్ణుడు శిశుపాలుని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించినప్పుడు కృష్ణుడు చూపుడువేలుకు గాయం అయ్యిందట. అది గమనించిన ద్రౌపతి తన పట్టు చీర కొంగు చూపి కృష్ణుడి చేతికి కట్టు కట్టిందట. అప్పుడు శ్రీకృష్ణుడు ఎల్లవేళలా అండగా ఉంటానని ద్రౌపతికు హామీ ఇచ్చారని చెప్తారు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాగతం నుండి ఆమెను శ్రీకృష్ణుడు కాపాడారని కూడా ఒక కథ ప్రచారంలో ఉంది.
లక్ష్మీదేవి బలిచక్రవర్తిల కథ
బలి చక్రవర్తి శ్రీమహా విష్ణువును పాతాళలోకానికి తీసుకువెళ్ళిన సమయంలో, ఆయనను తిరిగి తీసుకు రావటం కోసం లక్ష్మీ దేవి బలిచక్రవర్తికి రాఖీ కట్టి రక్షణ కల్పించాలని కోరినట్టు చెప్తారు. అప్పుడు విష్ణుమూర్తిని బలిచక్రవర్తి లక్ష్మీదేవి వద్దకు పంపినట్టు కథ ఉంది