వివాదాస్పద నటి, హాట్ బ్యూటీ రాఖీ సావంత్ సినిమాల కన్నా వివాదాస్పద వ్యాఖ్యలతోనే తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. ఒకప్పుడు బాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్తో పాటు ఐటమ్ నెంబర్స్ చేసిన ఈ భామ ప్రస్తుతం వెబ్ సిరీస్లతో బిజీగా ఉంది. మన్మోహినితో పాటు బాక్స్ క్రికెట్ లీగ్ సీజన్ 4లోనూ నటిస్తోంది. అంతేకాదు ఆర్టికల్ 370 సినిమాలో స్పెషల్ సాంగ్లో ఆడిపాడనుంది రాఖీ సావంత్. ఒకప్పుడు బాలీవుడ్లో వరుస వివాదాలతో హల్చల్ చేసిన అందాల భామ రాఖీ సావంత్ ఎప్పటికప్పుడు కావాలని ఏదో ఒక వివాదం సృష్టిస్తూ ఉంటారు. ఎప్పుడు గ్లామర్ ఒలకబోసే ఈ భామ తన పుట్టినరోజు సందర్భంగా తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాల గురించి వివరించింది. అగ్ని చక్ర సినిమాతో బాలీవుడ్కు పరిచయం అయిన రాఖీ సావంత్, స్కిన్ షోతోనే ఎక్కువగా ఫేమస్ అయ్యింది. కెమెరా ముందు నిలబడేందుకు ఎంతో ఇష్టపడే ఈ భామ బాలీవుడ్లో ఐటమ్ గర్ల్గా ఎన్నో సినిమాల్లో నటించింది. ముఖ్యంగా రాఖీ డ్యాన్స్ మూమెంట్స్కు ఎవరైనా ఫిదా కావాల్సిందే. అందుకే ఆమె కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ ఐటమ్ సాంగ్స్లో నర్తించింది. సాంప్రదాయ కుటుంబంలో జన్మించిన రాఖీ సావంత్ అసలు పేరు నీరు భేదా. ఆమె కుటుంబంలో ఆడపిల్లలు డాన్స్ చేసేందుకు అంగీకరిచేవారు కాదు. చిన్నతనంలో తాను డాన్స్ నేర్చుకుంటానని చెపితే తన అంకుల్ విపరీతంగా కొట్టాడని ఓ ఇంటర్య్వూలో వెల్లడించింది రాఖీ. సినిమాల్లో అవకాశాల కోసం నీరు భేదాగా ఉన్న పేరును రాఖీ సావంత్గా మార్చుకున్నట్టు వెల్లడించింది. సినిమాల్లోకి రాకముందే తాను ఎన్నో కష్టాలు పడ్డానని తెలిపింది రాఖీసావంత్. దర్శక నిర్మాతలను అవకాశాల కోసం కలిసినపుడు వారు తనని రూంలో పెట్టి బందించేవారట. కానీ ఏదో విధంగా అక్కడి నుంచి తప్పించుకునేదాన్నని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం కావటంతో పక్కింటి వాళ్లు మిగిల్చిన తిండి తిని బతికేవాళ్లమని తెలిపింది. అయితే ఇంట్లో నుంచి పారిపోయిన తను ఎన్నో కష్టాలు పడిన తరువాత ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలిగానంది.