భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణంపై పలువురు స్పందిస్తున్నారు. కొందరు యుద్ధం వద్దంటుంటే, మరికొందరు ఇంకా తీవ్రవాదులను ఉపేక్షించడం తగదని అంటున్నారు. ఇక సినీ వర్గాలు కూడా వారివారి స్పందనలను ఎప్పటికప్పుడు సామజిక మాధ్యమాల ద్వారా తెలియజేస్తూనే ఉన్నారు. తాజాగా, బాలీవుడ్ నటి రాఖీ సావంత్ కూడా ఈ విషయంపై స్పందించింది. పంజాబ్ లోని లూథియానాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె, మీడియాతో మాట్లాడుతూ, భరతమాత కోసం తాను చనిపోవడానికి సిద్ధమని చెప్పింది.
తనకు 50 నుంచి 100 బాంబులు ఇస్తే, శత్రు శిబిరాల్లోకి దూసుకెళ్లి, వారిని మట్టుబెట్టి వస్తానని వెల్లడించింది. పుల్వామాలో ఆర్మీ కాన్వాయ్ పై జరిగిన ఉగ్రదాడి తరువాత, ప్రధాని నరేంద్ర మోదీ సరైన చర్యలు తీసుకున్నారని అభిప్రాయపడింది. తాను కేంద్ర చర్యలను సమర్థిస్తున్నానని, పాకిస్థాన్ కు సరైన సమాధానాన్నే ఇచ్చామని చెప్పింది. ప్రస్తుతం పాకిస్థాన్ అదుపులో ఉన్న పైలట్ క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నట్టు తెలిపింది.