హైదరాబాద్ నగరంలోని గోషామహల్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన బీజేపీ నేత రాజాసింగ్ నేడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ శాసనసభ నూతన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన చేత ప్రమాణం చేయించారు. గురువారం అసెంబ్లీలో జరిగిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి రాజాసింగ్ సహా మరో నలుగురు ఎమ్మెల్యేలు హాజరు కాని విషయం తెలిసిందే.
ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన అనంతరం మీడియా సమావేశంలో రాజాసింగ్ మాట్లాడుతూ ఎంఐఎం పార్టీ నాయకులు హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడారని అన్నారు. సీఎం కేసీఆర్ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్ను చేసినందుకు ఆలోచించాలన్నారు. బంగారు తెలంగాణ కావాలంటే అందరినీ కలుపుకొని వెళ్లాలని కేసీఆర్కు విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు.