లండన్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. థింక్-ట్యాంక్ బ్రిడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో ‘‘ఐడియాస్ ఫర్ ఇండియా’’ పేరుతో లండన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..బీజేపీ దేశమంతటా కిరోసిన్ ఆయిల్ జల్లిందని దీనికి ఓ నిప్పు రాజేస్తే చాలునని రాహుల్ వ్యాఖ్యానించారు.
బీజేపీ సర్కార్ అన్నింటినీ ప్రవేటీకరణ చేస్తుందని..ప్రవేటు గుత్తాధిపత్యానికి ప్రొత్సహిస్తుందని రాహుల్ వ్యాఖ్యానించారు. మీడియాను కూడా నియంత్రించాలని భావిస్తున్నారని అన్నారు.
భారతదేశంలో రెండు విభిన్నమైన పాలనా విధానాలు కొనసాగుతున్నాయని రాహుల్ అన్నారు. అందులో ఒకటి గొంతులను అణచివేసేదని, మరొకటి వినేదని అన్నారు.
నేను వింటాను’’ అనే ధోరణిని ఆయన అలవరచుకోవాలని, అక్కడి నుంచే అన్నీ వస్తాయని అన్నారు. కానీ మన ప్రధాన మంత్రి ఎవరి మాట వినరన్నారు. మాట్లాడే అవకాశం ఇవ్వని దేశం ఉండదన్నారు.
ప్రజల మధ్య చర్చలు జరిగి, అభిప్రాయాలు పంచుకుని, తద్వారా నిర్ణయాలు తీసుకునే దేశం భారత దేశమని మనం విశ్వసిస్తామన్నారు. కానీ బీజేపీ, ఆరెస్సెస్ అభివృద్ధి ఫలాలు కేవలం కొద్ది మందికి మాత్రమే అందాలని కోరుకుంటున్నాయని అన్నారు. దళితుడికైనా, బ్రాహ్మణుడికైనా అందరికీ సమానంగా అందాలని తాము విశ్వసిస్తామని తెలిపారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాటం చేస్తోందని తెలిపారు.
కాంగ్రెస్ పదే పదే ఎన్నికల పరాజయాలు, బీజేపీ విజయాలకు గల కారణాలు ఏంటనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. పొలరైజేషన్, మీడియాపై పూర్తి ఆధిపత్యం ఎన్నికలలో అధికార పార్టీ విజయాల వెనుక కారకాలు అని అన్నారు.
ప్రజలను విభజించి, కొందరిని ఓ వైపునకు ఆకర్షించడం, మీడియాపై పూర్తి ఆధిపత్యం చలాయించడం ద్వారా ఆర్ ఎస్ ఎస్ ఓ వ్యవస్థను నిర్మించిందని, అది సామాన్య ప్రజల్లోకి చొచ్చుకెళ్ళిందని చెప్పారు. బీజేపీని ఎదుర్కొనడానికి కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు మరింత దూకుడుగా ప్రజల వద్దకు వెళ్ళాలన్నారు
బీజేపీకి ఓటు వేయని 60-70 మంది వద్దకు మనం మరింత దూకుడుగా వెళ్లాలని, మనం కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని రాహుల్ పిలుపునిచ్చారు.