దేవాలయాలపై జరుగుతోన్న దాడులపై ఏపీ సర్కారు చెబుతున్న సమాధానం సరికాదని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మండిపడ్డారు. మతి స్థిమితం లేని వారు కేవలం హిందూ దేవాలయాలను, రథాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నారా? అని ప్రశించారు. రాష్ట్ర మంత్రి వెల్లంపల్లి మతిలేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.
ఢిల్లీలోని తన నివాసంలో గాంధేయ పద్ధతిలో ఈ రోజు ఉదయం రఘురామకృష్ణరాజు హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయన ఓ ప్రకటన చేశారు. కరోనా విపత్తు సమయంలోనూ ప్రజలు తమ నిరసనలు తెలియజేసేందుకు రోడ్ల మీదకు వస్తున్నారని ఆయన చెప్పారు.
వారి భావోద్వేగాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవాలని చెప్పారు. వారి మనోభావాలు ఎలా దెబ్బతిన్నాయో ప్రభుత్వం గ్రహించాలని అన్నారు. అంతర్వేదిలో రథం దగ్ధమైన ఘటనపై చర్యలు తీసుకుని నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.