సరిహద్దుల్లో కయ్యనికి కాలుదువ్వుతున్న శత్రు దేశాలకు చెక్ పెట్టేందుకు భారత్ ఫ్రాన్స్ నుంచి రాఫెల్ ఫైటర్జెట్లను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అందులో అత్యాధునిక 36 రాఫెల్ యుద్ధవిమానాల్లో ఐదు భారత్కు చేరాయి. కాసేపటి క్రితం అంబాలాలోని ఎయిర్ బేస్ కు తొలి బ్యాచ్ లోని ఐదు జెట్ విమానాలు చేరుకున్నాయి.
ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన ఈ ఫైటర్ జెట్లు దాదాపు 7 వేల కిలోమీటర్లు ప్రయాణించి భరత గడ్డను ముద్దాడాయి. వీటికి మిలిటరీ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు. ‘గోల్డెన్ యారోస్’గా పిలిచే నెంబర్ 17 స్క్వాడ్రన్ లో ఇవి భాగం కానున్నాయి.
రాఫెల్ యుద్ధ విమానాలు అంబాలాలో ల్యాండ్ అయిన వెంటనే భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘లోహ విహంగాలు అంబాలాలో సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. రాఫెల్ విమానాలు మన గడ్డను తాకిన క్షణం తర్వాత భారత మిలిటరీ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయింది. మన వాయుసేన శక్తి సామర్థ్యాలు ఈ మల్టీ రోల్ ఎయిర్ క్రాఫ్ట్స్ తో మరింత పెరగనున్నాయి’ అని రక్షణ మంత్రి వ్యాఖ్యానించారు.