కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా పాఠాలు బోధించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సెప్టెంబరు 1 నుంచి రాష్ట్రంలో ఆన్లైన్ విద్యాబోధన ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య స్పందించారు. ఆన్లైన్ విద్యాబోధన మంచిదేనని అన్నారు. లక్షలాదిమంది పేద విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు వినే సౌలభ్యం లేదని అన్నారు. కాబట్టి వారికి ఉచితంగా ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు ఆయన తెలిపారు. మారుమూల, గిరిజన, పట్టణాల్లోని మురికివాడల్లో నివసిస్తున్న లక్షలాదిమందికి ల్యాప్టాప్, స్మార్ట్ఫోన్లు అందుబాటులో లేవన్నారు. దీంతో వారు ఆన్లైన్ పాఠాలు కోల్పోయే అవకాశం ఉందన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ చొరవ తీసుకోవాలని కోరారు.