క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లారీ డ్రైవర్ అల్లు అర్జున్ కనిపించబోతున్నాడు. ఈ మూవీలో హీరోయిన్గా రష్మిక మందన్నా నటిస్తోంది.
ఇటీవల రష్మిక ఫస్ట్లుక్ విడుదల చేసిన చిత్ర బృందం, తాజాగా ఆమెకు సంబంధించిన మరో అప్డేట్ను ప్రకటించింది. దసరా సందర్భంగా సెకండ్ సింగిల్ రష్మిక సంబంధించిన ఆసక్తికర అప్డేట్ ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా పుష్ప టీం ట్వీట్ చేస్తూ.. ‘ఆమె మన భయంకరమైన పుష్పరాజ్ హృదయాన్ని దొంగిలించింది. ఇప్పడు మన ఊపిరి తీసేందుకు వస్తోంది. పుష్ప నుంచి అక్టోబర్ 13న శ్రీవల్లి రాబోతోంది’ అంటూ తమ ట్వీట్లో రాసుకొచ్చారు. ఈ చిత్రంలో రష్మిక.. శ్రీవల్లి పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అలాగే ఫస్ట్ సింగిల్ దాక్కో దాక్కో మేక సాంగ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. డిసెంబర్ 17న పుష్ప ఫస్ట్ పార్ట్ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మూవీ టీం ఇటీవల అధికారిక ప్రకటన చేసింది.