ఆర్యన్ ఖాన్ ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో సాక్షిగా ఉన్న డిటెక్టివ్ కిరణ్ గోసావిని పూణేలో అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన్ని పూణె పోలీసులు విచారిస్తున్నారు. షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్తో సెల్ఫీ దిగడం ద్వారా గోసావి కూడా వెలుగులోకి వచ్చాడు. అనేక మలుపులు తిరుగుతున్నా ఆర్యన్ డ్రగ్స్ కేసులో కిరణ్ గోసావి అరెస్ట్ పెద్ద మలుపుగా చెప్పవచ్చని అధికారులు అంటున్నారు.
ఆర్యన్ అరెస్ట్ చేసి ఎన్సీబీ కార్యాలయానికి తీసుకొచ్చినప్పుడు కిరణ్ గోసావి సెల్ఫీ దిగడం వివాదాస్పదంగా మారింది. అయితే ఆర్యన్ అరెస్ట్ తరువాత ఈ విషయాలు వెలుగులోకి రావడంతో కిరణ్ గోసావి కనిపించకుండాపోవడం, అతనిపై పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేయడం లాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో అతని కోసం పోలీసులు వెతుకులాట మొదలు పెట్టారు. ఈ కేసులో గోసావిని “స్వతంత్ర సాక్షి” గా ఎన్సీబీ విచారించింది.
కాగా..కోట్లాది రూపాయల వ్యవహారంలో గోసవిపై ఆయన అంగరక్షకుడు ప్రభాకర్ సంచలన ఆరోపణలు చేశాడు. ఆర్యన్ఖాన్ను విడిచిపెట్టడానికి ఎన్సీబీ అధికారులతో రూ.25 కోట్లకు డీల్ కుదిరిందని ప్రభాకర్ సాయిల్ సంచలన కామెంట్స్ చేశారు. ఆ మొత్తంలో రూ.8 కోట్లు ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడేకి ముట్టజెప్పాలని ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా ప్రభాకర్ తాను సమర్పించిన అఫిడవిట్లో ఆరోపించారు.