కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి రాహుల్ గాంధీ తప్పుకున్న సంగతి రికీ తెలిసిందే. రాహుల్ తన బాధ్యతల నుంచి తప్పుకొని చాలా రోజులు అవుతున్నా ఆ పదవిని అధిష్ఠించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. రాహుల్ గాంధీనే కొనసాగాలన్న డిమాండ్ పార్టీలో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో పూణెకు చెందిన 28 ఏళ్ల ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్ గజానంద్ హోసాలే ఆ బాధ్యతలు తనకివ్వమని కోరాడు. ఓ ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్న గజానంద్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దరఖాస్తు చేయాలని నిర్ణయించాడు. ఈ మేరకు రేపు నగర అధ్యక్షుడి రమేశ్ బగ్వేకి తన దరఖాస్తును ఇచ్చేందుకు సమాయత్తం అవుతున్నాడు.
రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న తర్వాత పార్టీ డైలమాలో పడిపోయిందని, ఎవరిని ఎన్నుకోవాలన్న దానిపై పార్టీలో గందరగోళం ఉందని గజానంద్ పేర్కొన్నాడు. ఈ పరిస్థితుల్లో ఆ పోస్టు కోసం నామినేషన్ వేయాలని అనిపించిందని పేర్కొన్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్కు యువ నాయకత్వం అవసరమని అభిప్రాయపడ్డాడు.తనకు ఒక్క అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ దశ, దిశలను మార్చి తన సత్తా ఏంటో చూపిస్తానంటున్నారు. కాగా, పార్టీ అధ్యక్ష పదవిని కోరుకుంటున్న గజానంద్కు ఇప్పటి వరకు రాజకీయాల్లో ఎటువంటి అనుభవం లేకపోవడం గమనార్హం. గజానంద్ కామెంట్స్ ఇప్పుడు పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.