“హరహర మహాదేవ శంభో శంకర” సీరియల ఫేం పూజా బెనర్జీ తన చిరకాల మిత్రుడు, నటుడు కునాల్ వర్మను వివాహమాడారు. ఇరు కుటుంబాల ఆశీర్వాదంతో నూతన జీవితాన్ని ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట గత నెలలోనే కోర్టు మ్యారేజీ ద్వారా తమ పెళ్లిని రిజిస్టర్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ 15న అంగరంగ వైభవంగా పెళ్లి వేడుక జరుపుకోవాలని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. అయితే ఈలోగా మహమ్మారి కరోనా విజృంభణతో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. అయితే లాక్డౌన్ కారణంగా వివాహ వేడుకలకు ఖర్చు చేయాలనుకున్న మొత్తాన్ని సామాజిక కార్యక్రమాలకు వెచ్చించనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని పూజా, కునాల్ సోషల్ మీడియాలో వెల్లడించారు. ‘‘ఈరోజు మా పెళ్లి వేడుక జరగాల్సింది. అయితే దానిని మేం రద్దు చేసుకున్నాం. అధికారికంగా మేము ఇప్పుడు భార్యభర్తలం. మా తల్లిదండ్రులు, తాతా- బామ్మల ఆశీస్సులతో కొత్త జీవితం ప్రారంభిస్తున్నాం. మా వంతు సాయంగా పెళ్లి వేడుకల కోసం ఖర్చు చేయాలనుకున్న డబ్బును విరాళంగా ఇస్తున్నాం. మళ్లీ ఈ ప్రపంచం త్వరలోనే పూర్వస్థితికి రావాలని ఆశిస్తున్నాం. జై మాతాది’’అని ఇన్స్టాగ్రామ్లో పేర్కొన్నారు.