బ్యాంక్ యూనియన్లు సమ్మెకు దిగుతున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. యూనియన్లు నెలఖరులో రెండు రోజులపాటు స్ట్రైక్ చేయనున్నాయి. ఇందులో బ్యాంక్ ఉద్యోగులు కూడా పాల్గొంటారు. అంటే బ్యాంకులు కూడా పూర్తి స్థాయిలో పనిచేయకపోవచ్చు. బ్యాంకింగ్ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది. బ్యాంక్ ఉద్యోగులు జనవరి 31, ఫిబ్రవరి 1 తేదీల్లో సమ్మె చేయనున్నారు. దీంతో ఉద్యోగుల వేతనాలు ఎప్పుడు అకౌంట్లలో పడతాయనే అంశంపై కొంత సందిగ్దత నెలకొంది. అయితే జనవరి 31న సమ్మె నేపథ్యంలో ఉద్యోగులకు ముందుగానే వేతనాలు అకౌంట్లలో పడిపోయే అవకాశముంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వేతనాలు ముందే రావొచ్చు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ వాటి ప్రిన్సిపల్ అకౌంట్స్ ఆఫీసెస్ (పీఏఓ)లను శాలరీ పేమెంట్స్ ఫైల్స్ను జనవరి 28 నాటికే పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్లో అప్లోడ్ చేయాలని ఆదేశించాయి. ఇకపోతే బ్యాంక్ యూనియన్లు వేతన సవరణ అంశానికి సంబంధించి సమ్మె చేస్తున్నాయి. ఐబీఏతో జరిపిన వేతన సవరణ చర్చలు కొలిక్కి రాకపోవడంతో బ్యాంక్ యూనియన్లు దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెలో 9 బ్యాంక్ యూనియన్లు పాల్గొబోతున్నాయి. కాగా బ్యాంక్ యూనియన్లు 20 శాతం పెంపుతో వేతన సవరణ సెటిల్మెంట్ ఉండాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే దీనికి ఐబీఏ (ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్) అంగీకరించలేదు. 2012 నవంబర్ 1 నుంచి 2017 అక్టోబర్ 31 వరకు మధ్య కాలానికి ఉద్యోగులకు 15 శాతం వేతన పెంపు లభించింది.
previous post