ఇరాక్లో అమెరికా దాడిపై న్యూయార్క్ నగరంలో యుద్ధ వ్యతిరేకులు తీవ్ర నిరసన తెలియచేశారు. ‘అంతు లేని యుద్ధం కాదు… ఉద్యోగాలు, ఆరోగ్య పరిరక్షణ, విద్య, గృహనిర్మాణం, మానవ అవసరాలు కావాలంటూ నినాదాలు చేశారు. ‘యుద్ధం, ఇరాన్పై ఆంక్షలు వద్ద’ రాసిన ప్లకార్డులను ప్రదర్శించారు. అమెరికా మధ్యప్రాచ్యం నుండి వైదొలగనంత వరకూ శాంతి వుండదు, న్యాయం జరగదని, ఇరాన్తో యుద్ధం వద్దని వారు ముక్తకంఠంతో నినదించారు. బ్కూఇ్లన్లోని చుక్ స్కిమ్మర్ అపార్ట్ మెంట్ వెలుపల ఒక ర్యాలీ జరిగిన కొద్ది గంటల తరువాత ఈ నిరసన ప్రదర్శన జరగటం గమనార్హం.
ఇరాన్ సైన్యాధికారి మేజర్ జనరల్ కాసిం సొలీమని హత్యను ఖండించేందుకు అనేక యుద్ధ వ్యతిరేక గ్రూపులు ఈ నిరసన ప్రదర్శన నిర్వహించాయి. సొలిమని హత్య నేపథ్యంలో న్యూయార్క్ నగరంలో భద్రతనుకట్టుదిట్టం చేశారు. వంతెనలు, సొరంగాల వద్ద వున్న కార్ స్టాప్లు,సబ్ వేల వద్ద భద్రతా సిబ్బంది నగర ప్రజలను విస్తృత స్థాయిలో తనిఖీ చేస్తారని న్యూయార్క్ నగర మేయర్ బిల్డి బ్లాసియో మీడియా సమావేశంలో చెప్పారు.