తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ చీకటి వ్యాపారాలకు నెలవుగా మారుతోంది. త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఇలాంటివి కూడా చాపకింద నీరులా వ్యాపిస్తూనే ఉండటం విచారకరం. చీకటి వ్యాపారాలలో ఒకటైన వ్యభిచారం నిన్నటిదాకా అభివృద్ధిలో కాస్త వెనక ఉండి, ఇటీవలే పుంజుకున్న ప్రాంతాలలో అధికంగా జరుగుతుండటం నగర పోలీసులకు కూడా సమస్యగా మారింది. వీటికి అడ్డాగా, నివాస ప్రాంతాలనే చేసుకోవటంతో, అధికారులకు కూడా కనిపెట్టడం పెద్ద సమస్యగానే ఉంది. ఇక వీటివెనుక పెద్దవారి అండదండలు ఉండటం కూడా పెద్ద సమస్యగానే పరిణమిస్తున్నాయి.
తాజాగా, హైదరాబాద్లోని కూకట్పల్లి భాగ్యనగర్ కాలనీ బస్టాప్ను అడ్డాగా చేసుకుని వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. రాత్రి 9 గంటల నుంచి 12 గంటల వరకు దందా జోరుగా సాగుతోందన్న సమాచారంతో నిఘా వేసిన పోలీసులు 27 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ న్యాయస్థానంలో హాజరు పరిచి అనంతరం జైలుకు తరలించినట్టు కూకట్పల్లి ఎస్ఐ నారాయణసింగ్ తెలిపారు. ఇకపైనా దాడులు కొనసాగుతాయని, బస్టాపులను అడ్డాగా చేసుకుని ప్రయాణికులను వేధిస్తే ఊరుకునేది లేదని ఎస్సై హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు.