telugu navyamedia
రాజకీయ

సుప్రీంకోర్టులో నుపుర్ శర్మకు ఊరట..ప్రాణహాని ఉంది నిజమే..అప్ప‌టివ‌ర‌కు చర్యలు తీసుకోవద్దు

బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు సుప్రీంకోర్టులోఊరట దక్కింది. ఓ టీవీ ఛాన‌ల్ మహ్మద్ ప్రవక్తపై ఆమె ఇటీవల చేసిన కామెంట్స్ దేశంలో తీవ్ర వివాదానికి కారణమయ్యాయి. తదనంతర పరిణామాలతో ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదయ్యాయి.

ఇష్యూ సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర దుమారానికి కారణం కావడంతో.. ఆమె బీజేపీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత రాజస్థాన్ లో జరిగిన దారుణ హత్య ఘటనలోనూ కోర్టు స్పందిస్తూ దానికి కారణం నుపుర్ శర్మేనని ఘాటుగా వ్యాఖ్యానించింది.

తాజాగా విచార‌ణ సంద‌ర్భంగా నుపుర్‌ శర్మపై సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. నుపుర్‌ శర్మపై ఆగస్టు 10 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది.

తనకు ప్రాణహాని ఉందన్న నుపుర్‌ శర్మ వాదనలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ పార్దీవాలా ధర్మాసనం.. ఆమెకు అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పించింది. భవిష్యత్తులో నమోదయ్యే కేసుల విషయంలోనూ ఈ తీర్పు వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

నుపుర్ శర్మపై ఇప్పటికే పలు రాష్ట్రాల్లో 9 కేసులు నమోదయ్యాయి. తనపై నమోదైన కేసులన్నింటినీ ఒకే కోర్టుకు మార్చాలన్న నుపుర్‌శర్మ విజ్ఞప్తిపై.. కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ, బంగాల్, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఆగస్టు 10 లోగా ప్రతిస్పందన తెలియజేయాలని ఆదేశించింది. అనంతరం విచారణను ఆగస్ట్ పదో తేదీకి కేసు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. అప్పటివకు ఆమెపై ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దని పోలీసులకు సూచించింది

జులై1న నూపుర్ శర్మ పిటిషన్ విచారణ సందర్భంగా ఆమెపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది సుప్రీంకోర్టు. టీవీ డిబేట్‌లో బాధ్యత లేకుండా మాట్లాడటం వల్ల దేశంలో ఆమె అగ్గిరాజేసిందని మండిపడింది. దేశంలో ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులకు నూపుర్ శర్మ వ్యాఖ్యలే కారణమని ధ్వజమెత్తింది.

Related posts