telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ఆచార్య జయశంకర్‌ జయంతి స్పెషల్

తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరుపొందిన ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్ 06 ఆగస్టు 1934 సంవత్సరంలో పెద్దాపూర్ గ్రామ శివారు అక్కంపేట గ్రామం ఆత్మకూరు మండలం ప్రొ. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జన్మించారు. తల్లి మహాలక్ష్మి, తండ్రి లక్ష్మీకాంతారావు. తెలంగాణ కారణజన్ముడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్. చిన్నతనం నుండే నిజాం నిరంకుశత్వాన్ని అన్యాయాన్ని వ్యతిరేకించినవాడు ఆయన. తాను ఆరో తరగతి చదివేటప్పుడు స్కూల్లో నిజాంను పొగుడుతూ పాడిన పాటను బహిష్కరించి వందేమాతరం అని నినదించారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, హైస్కూల్, ఇంటర్మీడియట్ వరకు హనుమకొండ వరంగల్‌లో జరిగినది. డిగ్రీ హైదరాబాద్‌లో, బనారస్ హిందూ యూనివర్శిటీ, అలీఘర్ ముస్లిం యూనివర్శిటీల నుండి ఆర్థికశాస్త్రంలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చదివారు. ఉస్మానియా యూనివర్శిటీ నుంచి పిహెచ్‌డి చేశారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషులో మంచి పరిజ్ఞానం ఉండేది.

1975 నుండి 1979 వరకు సికెఎం కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. 1979 నుండి 1981 వరకూ కాకతీయ యూనివర్శిటీ రిజిస్ట్రార్‌గా 1982 నుండి 1991 వరకు సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ రిజిస్ట్రార్, 1991 నుండి 1994 వరకు కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పని చేశారు. ఆయన శిష్యులు దేశవిదేశాల్లో చాలామంది ఉన్నారు. ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించారు వారిలో కాకతీయ యూనివర్శిటీ ప్రొ. లింగమూర్తి, శ్రీ కూరపాటి వెంకటనారాయణ, ఫ్రీ సీతారామ రావు ఉన్నారు. ఆయనకు అప్పటి ఆర్.బి.ఐ గవర్నర్, మాజీ ప్రధానమంత్రి అయిన డా. మన్మోహన్ సింగ్‌తో మంచి స్నేహమే ఉండేది. అందువల్లనే ఆచార్య కాకతీయ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ గా ఉన్నప్పుడు జరిగిన కాన్వకేషన్‌కు డా. మన్మోహన్ సింగ్‌ని ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి మన్మోహన్ సింగ్‌ రావడం జరిగింది. నేషనల్ కమిషన్ ఫర్ ఎంట్ర్పజెస్ ఫర్ రూరల్ ఆర్గనైజేషన్ సభ్యుడిగా నియమించబడ్డారు. 1999 నుండి 2000 వరకు అమెరికాలో ఉంటూ తెలంగాణ ప్రజలందరికీ సహకరిస్తూ తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను, ఉద్యమం గురించి అవగాహన కల్పిస్తూ అమెరికాలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టిడిఎఫ్) ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటులో భాగంగా నేటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జయశంకర్ సార్ మార్గదర్శకత్వాన్ని సమ్మతిస్తూ వారి సలహాలను స్వీకరిస్తూ తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించారు. 2009 తెలంగాణ రాష్ట్రం కోసం కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేసిన దీక్షకు మద్దతు తెలిపారు.

ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఆ సమయంలో ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి లోకం ఇచ్చిన అసెంబ్లీ ముట్టడి పిలుపుతో అప్పటి హోం మంత్రి పి చిదంబరం, యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ జయశంకర్ సార్‌తో మాట్లాడి తెలంగాణ ప్రక్రియ ఆరంభమైందని అర్ధరాత్రి ప్రకటన విడుదల చేశారు. తెల్లవారితే అసెంబ్లీ ముట్టడి. ఆచార్య ఉస్మానియా యూనివర్శిటీ గురించి ఏమన్నారంటే ‘ఉస్మానియా యూనివర్శిటీనీ తలుచుకుంటే తెలంగాణ వాడినైనందుకు చాతి ఉబ్బుతుంది. ఎన్నెన్నో పోరాటాలకు, ఆరాటాలకు వేదికయ్యింది. ఉస్మానియా యూనివర్శిటీ అంటే అందరికీ చెట్లు, బిల్డింగులు కనిపిస్తాయి. కానీ నాకు మాత్రం మొన్నటికి మొన్న తెలంగాణ కోసం అమరులైన అనేక మంది విద్యార్థులు ఆ చెట్ల సాక్షిగా కదులుతూ కనిపిస్తారు. దుఃఖం వస్తుంది. అయితే యావత్తు తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచే అదృష్టం ఎంతమందికి దక్కుతుంది. వాళ్లకు మరణం లేదు. అదే ఉస్మానియా యూనివర్శిటీలో డిసెంబరు 9 ప్రకటన తర్వాత పిల్లలు జరుపుకున్న సంబరం నా జీవితంలో మర్చిపోలేని గొప్ప జ్ఞాపకం అని ఆయన గుర్తు చేసుకున్నారు’. అన్నారు.

1952లో వచ్చిన నాన్ ముల్కీ ఉద్యమంలో భాగమైన ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అంటూ ఉద్యమించారు. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడే రోజులు కావు అయినప్పటికీ 1954లో ఫజల్ అలీ కమిషన్ రిపోర్టు ఆధారంగా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర విలీనాన్ని వ్యతిరేకించారు.1969లో వచ్చిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడక ముందు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా చాలా పార్టీలు ఏర్పడ్డాయి. వారందరూ కూడా ఆచార్య సలహాలు, సూచనలు తీసుకునేవారు. అయితే తెలంగాణ పోరాటంలో ఎందరో నేతలను కలిసినప్పటికీ కేవలం కేసీఆర్‌ మాత్రమే నన్ను ఇంప్రెస్స్ చేయగలిగారు అని జయశంకర్ అన్నారు. మన ముఖ్యమంత్రిని ఆచార్య సాబ్ అనేవారు. ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్ గారు.. ‘తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్’, ‘తెలంగాణలో ఏం జరుగుతోంది’, ‘వక్రీకరణలు వాస్తవాలు’, ‘తల్లడిల్లుతున్న తెలంగాణ’, (వ్యాస సంపుటి) తెలంగాణ (ఇంగ్లీష్) మొదలగు రచనలు చేశారు.

చివరి రెండు సంవత్సరాలు ఆయన గొంతు కేన్సర్‌తో బాధ పడ్డాడు. హైదరాబాదులో గొంతు కేన్సర్‌కు చికిత్స తీసుకున్నప్పటికీ అది నయం కాలేదు. 2011 జూన్ 21న తన స్వగృహం నందు ఆయన కన్నుమూశారు. ఆయన గౌరవార్ధం తెలంగాణ ప్రభుత్వం అగ్రికల్చర్ యూనివర్శిటీకి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్శిటీ గా, కొత్తగా ఏర్పడిన భూపాలపల్లి జిల్లాకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాగా నామకరణం చేయడం జరిగింది.

Related posts