ఏపీలో ఇంకా చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. అన్ని పార్టీలు తమ తమ అభ్యర్థులను పూర్తిస్థాయిలో ప్రకటించిన అనంతరం కూడా ఈ చేరికలు ఆగకపోవటం విశేషం. తాజాగా వైసీపీలోకి మరో టాలీవుడ్ సినీ నిర్మాత చేరేందుకు రంగం సిద్ధమయింది. త్వరలోనే తాను వైసీపీలో చేరబోతున్నట్లు నిర్మాత నట్టికుమార్ ప్రకటించారు. తాను 1981 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని పేర్కొన్నారు. కానీ ఏపీలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య కొనసాగుతున్న చీకటి ఒప్పందం నచ్చకే కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలో చేరుతున్నట్లు నట్టికుమార్ చెప్పారు. టీడీపీకి ఓటేయకపోతే మహిళల పసుపు-కుంకుమలు పోతాయని టీడీపీ నేత రాజేంద్రప్రసాద్ చెప్పడాన్ని నట్టికుమార్ తప్పుపట్టారు. రాజేంద్రప్రసాద్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
జగన్ ను ఇబ్బంది పెట్టేందుకే పవన్ కల్యాణ్, కేఏ పాల్ లను చంద్రబాబు వాడుకుంటున్నారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. తెలంగాణలో ఆంధ్రప్రాంత ప్రజలు ప్రశాంతంగా ఉన్నారనీ, ఏపీ ప్రజలను తెలంగాణలో కొడుతున్నారని పవన్ కు ఎవరు చెప్పారో తనకు తెలియదని నట్టికుమార్ వ్యాఖ్యానించారు. అనవసరంగా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దన్నారు. హైదరాబాద్ పదేళ్ల ఉమ్మడి రాజధానిగా ఉండగానే, బాబు ఏపీ వచ్చేసి, తన స్వార్ధ ప్రయోజనాల కోసం అమరావతి అంటూ సినిమా ప్రారంభించారని ఆయన అన్నారు.