telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌ : .. దిల్లీ వరుస విజయాలు..

pro kabaddi delhi won twice

దబాంగ్‌ దిల్లీ వరుసగా రెండో విజయం సొంతం చేసుకుంది. ఆఖరి నిమిషం వరకు ఉత్కంఠకరంగా సాగిన పోరులో తమిళ్‌ తలైవాస్‌ను 30-29 తేడాతో ఓడించింది. రెండు జట్ల మధ్య అంతరం కేవలం ఒక పాయింటే కావడం గమనార్హం. ఆట ముగిసేందుకు ఇంకా ఆరు నిమిషాలే ఉందనగా తలైవాస్‌ 28-20తో పూర్తి ఆధిక్యంలో ఉంది. అయితే ఆ జట్టు ప్రధాన రైడర్‌ రాహుల్‌ ఔటౌవ్వడంతో కథ మారింది. ఆఖరి రెండు నిమిషాల్లో దిల్లీ ఆటతీరే మారిపోయింది. ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టి విజయం అందుకుంది. రాహుల్‌ చౌదరి (7 పాయింట్లు) మొదట్లో దూకుడుగా ఆడటంతో తొలి అర్ధభాగం ముగిసే సరికి తమిళ్‌ తలైవాస్‌ 18-11తో నిలిచింది. అజయ్‌ ఠాకూర్‌ (5), మంజీత్‌ చిల్లర్‌ (5) అతడికి తోడుగా రాణించడంతో రెండో అర్ధభాగం చివరి వరకు విజయంపై ధీమాగా ఉంది.

మరో ఐదు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా 21-28తో వెనకబడ్డ దిల్లీ అనూహ్యంగా పుంజుకుంది. ఆ జట్టు రైడర్‌ నవీన్‌ కుమార్‌ సూపర్‌రైడ్‌తో అజీత్‌, వినీత్‌, రణ్‌సింగ్‌ను ఔట్‌ చేసి 24-28తో ఆటను మలుపు తిప్పాడు. అదే సమయంలో డూఆర్‌డై రైడ్‌కు వెళ్లిన అజయ్‌ ఠాకూర్‌ను విశాల్‌ మానె అద్భుతంగా ట్యాకిల్‌ చేయడంతో తలైవాస్‌ ఆలౌటైంది. ఆ తర్వాత నవీన్‌ కూతకు వెళ్లి అజీత్‌ను ఔట్‌ చేయడంతో స్కోరు 28-29గా మారింది. మరోసారి కూతకువెళ్లిన అజయ్‌ను నవీన్‌ కుమార్‌ పట్టేశాడు. దాంతో స్కోరు 29-29గా మారింది. చివరి నిమిషంలో డూఆర్‌డై రైడ్‌కు వెళ్లిన నవీన్‌.. మంజీత్‌ను ఔట్‌ చేసి దిల్లీకి విజయం అందించాడు. మొత్తం 7 పాయింట్లు తెచ్చాడు.

Related posts