కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రియాంకగాంధీకి పగ్గాలు అప్పగించాలనే డిమాండ్లు పార్టీలో వినపడుతున్నాయి. ఇదే విషయం పై కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ కూడా స్పందించారు. ప్రియాంకు పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించాలని ఆయన అన్నారు. గాంధీల నాయకత్వం లేకపోతే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరి అవుతుందని చెప్పారు.
ఉత్తరప్రదేశ్ లోని సోనభద్రలో చనిపోయిన వారి కుటుంబీకులను ప్రియాంక కలవడం, వారిలో ధైర్యాన్ని నింపడాన్ని నట్వర్ సింగ్ ప్రశంసించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా ఆమె పట్టువీడకుండా, అక్కడే ఉండి, వారిని పరామర్శించడం అభినందించదగ్గ విషయమని చెప్పారు. ఏం చేయాలనుకున్నారో అది చేసేంత వరకు ఆమె పట్టు వీడలేదని అన్నారు. ఇది ఆమె నాయకత్వ లక్షణాలను సూచిస్తోందని చెప్పారు. గాంధీల కుటుంబం నుంచి కాకుండా, బయటి వ్యక్తిని పార్టీ అధినేతగా చేయాలన్న నిర్ణయాన్ని రాహుల్ గాంధీ వెనక్కి తీసుకోవాలని నట్వర్ సింగ్ సూచించారు.
మిషన్ బిల్డ్ పేరిట రాష్ట్రాన్ని అమ్మకానికి పెడుతున్నారు: అనురాధ