ఉత్తరప్రదేశ్ ఉన్నావోలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ ప్రధాన నిందితుడిగా ఉన్న అత్యాచారం కేసులో విచారణ జరుగుతోన్న విషయం తెలిసిందే. తాజాగా అదే ప్రాంతంలో మరో ఘటన కలకలం రేపింది. అత్యాచార బాధిత మహిళను నిందితులు సజీవ దహన యత్నం చేయగా ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన పై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ స్పందించారు.
ఉత్తరప్రదేశ్ లో శాంతిభద్రతలు అదుపుతప్పాయని విమర్శించారు. అత్యాచార బాధితురాలిని హత్య చేయడంపై స్పందించారు. గతంలో ఉన్నావోలో జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకొని, రాష్ట్ర ప్రభుత్వం బాధితురాలికి ఎందుకు భద్రత కల్పించలేకపోయింది. నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయని అధికారిపై ఏ చర్యలు తీసుకున్నారని ఆమె ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్ లో మహిళలపై జరుగుతోన్న దాడులను అరికట్టడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రియాంక నిలదీశారు.