ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ విమర్శనాస్త్రాలు సంధించారు. యూపీలోని మీర్జాపూర్, సలెంపూర్ ల లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆమె మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యుత్తమ నటుడు మోదీ అని అన్నారు. ప్రజలు ఆయనకు బదులు అమితాబ్ బచ్చన్ ను ప్రధానిగా ఎన్నుకుని ఉండాల్సిందని వ్యాఖ్యానించారు.
అభివృద్ధి అజెండా కంటే, పబ్లిసిటీ, అబద్ధాలతోనే మోదీ లబ్ది పొందాలని చూస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారణాసి ప్రజలకు మోదీ ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. నాయకుడు అనేవాడు ప్రజలకు నిజాలు చెప్పాలని ప్రియాంక డిమాండ్ చేశారు. మోదీ మాత్రం అవాస్తవాలు చెబుతూ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.